Monday, January 21, 2019

పురాణగుమ్మడి ..2018


పురాణగుమ్మడి ..1 నుండి 25 వరకు
1--24/8/2018
ఉ//(పంచపాది)
నేరక జంపెగా కొమరు నేర్పడ యుద్ధము తండ్రి బిడ్డకున్
కూరిమి గల్గినట్టిసతి గోరగ పొందెను ప్రాణమాతడున్
తూరపు బొజ్జయున్, వక్రపు తొండము, నొజ్జయు, నేకదంతమున్
కోరగ విఘ్నముల్ తొలగుఁ గూసిని చప్పిడి ముద్దలిచ్చిన, నే
కోరితి గావుమంచు మలిగుమ్మడి యాటకు, నెవ్వరందురో.,?
జవాబు ..."శ్రీ విఘ్నేశ్వరుడు".
(స్వామికి నా గుజీళ్ళ సహిత ప్రణామములు)

2--25/8/2018
చం//
చదువులతల్లి, కబ్బమును, శారద, భారతి, తెల్లతల్లికిన్
చదువులతొయ్యలే, మనకు శాబ్దియు, వాణియు, లచ్చి కోడలున్
చదువులదేవి పావకియు, జవ్వని, భాషలపల్కుబోణి, నా
మదినిలువంగ వేడితిని మాతను బ్రోవ ద్విగుమ్మడాటకున్
సరైన జవాబు---"సరస్వతీదేవి"
(నలువ రాణికి నా నమస్సులు)

3--26/8/2018
ఉ//
నాతికి యర్ధభాగమిడి నాదము,నాట్యము,శంఖు శూలముల్
చేతిన భిక్షపాత్రగొని చెంగున దూకుచు ప్రేతవాసమున్
పాతఁ మృగమ్ముచర్మమె, ప్రభాకరుడున్సిగపువ్వు యెవ్వరో
నాతని మ్రొక్కెదన్మిగుల నా మరుగుమ్మడి యాటవేళలో
సరైన జవాబు ---"శంకరుడు"
(హరహర మహాదేవ శంభోశంకర )

4--27/8/2018
మ,కో//
రక్తవర్ణపు వస్త్రధారియుఁ రక్తవర్ణపు పువ్వుల
వ్యక్తమున్గనుమాల, గంధము, పక్షి బృందము సేవయున్
రక్తవర్ణపు గన్నులామెకు రక్తవర్ణపు వెల్గులున్
భక్తు లందరి గాయుచుండెడి పావనెవ్వరు మ్రొక్కెదన్
సరైన జవాబు--ఆదిపరాశక్తి
(అమ్మల గన్నయమ్మ ముగురమ్మల పూలపుటమ్మకిదే మ్రొక్కితి)

5--28/8/2018
మ,కో//
అష్టసంతుగఁ గల్గె తల్లికి యష్టమున్చెరసాలలో
అష్ట భార్యలు గల్గితుంటరి యాతడే జగమంతటిన్
కష్టమందున గాయుచుండును, గాసె కృష్ణకు మానమున్
ఇష్ట దైవము నాకు మిక్కిలి యీతడే ననుబ్రోచుగా
సరైన జవాబు--శ్రీకృష్ణ పరమాత్మ
(కృష్ణా,పరంధామా,రాధాలోలా ,సత్యాపతీ,రుక్మిణీ వల్లభా ప్రణామములు)

6--29/8/2018
మ.కో(మాలిక)
పుట్టి గుడ్డికి జూపుటేలనొ పూర్ణచంద్రుని యందమున్
వట్టి మూగయు జెప్పజాలున భక్తి గూడిన వేదమున్
వట్టి కణ్వుడు శంఖనాధముఁ బట్ట నేర్చున శ్రోతగన్
గట్టి ప్రాఙ్ఞుడునైననేమిటి గానకున్నట యీశ్వరున్
పట్టుకుంటిని గట్టిగానిట భక్త వల్లభు పాదముల్
పట్టనేమిటి లాభమున్నది పట్టుకుంటివె యన్యముల్
ఇట్టి మాటలనన్న దెవ్వరొ యెవ్వరచ్చరు వందగన్
సరైన జవాబులు
మాటలన్నది...ప్రహ్లాదుడు..
అచ్చెరువొందినది...,హిరణ్యకశుపుడు

7--30/8/2018   
మ.వి//
ఋషులన్దోచగ నడ్డగించెనట హైరిక్కుండుగా మారి, తా
ఋషులఙ్ఞాన ప్రబోధమున్గొని మహారిష్యైన వారెవ్వరో ?
కృషిసల్పంగను మంచి గ్రంధమిలదక్కెన్ రామనామంబుతో
ఋషులా నామము లేడొసంగఁగని నేహృష్తుండనౌదిచ్చటన్!
జవాబులు,,1)"అగ్నిశర్మ",,(రత్నాకరుడు అంటారు కొందరు) (ఋషిగా మారక ముందు  వాల్మీకి మహర్షి అసలునామము అగ్నిశర్మ)
2) సప్త ఋషులు..,,
a)కశ్యపుడు b)అత్రి  c)భరద్వాజుడు  d) విశ్వామిత్రుడు e)గౌతముడు  f)జమదగ్ని  g)వసిష్టుడు

8---31/82018
చం//
ఎవరు సపత్ని గానిలచె నెంచగఁ, దక్షుని యాగ సంకటం
బవగనె దాచినామెకును బాధగ గర్భముఁ దాల్చకయ్యి నా
అవగతి గల్గినిద్దరు మహామహితాత్ముల గొప్ప మాతకున్!
శివునికిఁ యర్ధభాగమున జేరిన పావన దేవతందురా?
సరైన జవాబు..."గంగ"....
(ఎవరు సపత్ని ఈమెకు (సపత్ని అనగా సవతి) పార్వతి సవతి గంగ  )

9 పురాణగుమ్మడి-1/9/2018
ఉ// (పంచపాది)
అంశము మోహభావము తనయ్యది తీర్చెను సత్యనిష్టుడై
సంశయ మొందకన్మునికి సమ్మతొసంగగ నిల్చెవంశమున్
వంశము నిల్చెగా నితడు భారము మోసిన బ్రహ్మచారి,తా
నంశము దెల్పనొక్క శతయమ్ములు గుప్పిన వారలెవ్వరో
సంశయ మిప్పరే బుధుల్ శాంతము నందరు వేగిరంబుగా!
సరైన జవాబు.....శిఖండి (ముందుగా వంద బాణములు భీష్ముని మీద గుప్పించినది శిఖండి అటుపిమ్మటే పార్ధుని శరపరంపర భీష్ముని శరీరమును తూట్లుపొడిచినది )

10 పురాణగుమ్మడి 2/9/2018
చం//(పంచపాది)
మహతిని చేగొనాతడును మౌనియె బుట్టెనదెద్ది భాగ్యమౌ
మహిమలు గల్గినాతనికి, మాటలయందున మేటి లోకమం
త హరుసమే యొసంగుచును తాపసినేగు త్రిలోక సంచరై
సహితములేదు బిల్లల విచారముఁ లేదుగ దక్ష శాపమున్
కుహరము నింపజూచుతను కొండెపు చర్యల భోజనంబుతోఁ
సరైన జవాబు.,"బ్రహ్మదేవుని తొడభాగము"
(పుట్టిన దెద్ది ఎక్కడ? అనేదినాప్రశ్న)

11.పురాణగుమ్మడి-3/9/2018
ఉ//
ఎవ్వని మానసందలువ నిగ్గునొ పాపము  ప్రాయచిత్తమై
ఎవ్వని కీర్తనల్నుడువ నెచ్చునొ ఖ్యాతియు గౌరవంబులున్
ఎవ్వని గీత బోధనలు నిచ్చునొ శాంతిని, మ్రొక్కెదాతనిన్
ఎవ్వరు దేవదేవుడరి యెవ్వరు నొంచెను చెప్పరే బుధుల్
సరైన జవాబు
1)జరాసంధుడు
2)భీమసేనుడు
ఎవ్వరు పార్ధసారధరి --- (అరి అనగా శత్రువు)  శ్రీకృష్ణ పరమాత్మ శత్రువు జరాసంధుడు
నెవ్వరు నొంచెను---(నొంచు అనగా చంపుట) ఇతనిని కృష్ణుడు చంపలేదు భీమునితో చంపించినాడు)

12-పురాణగుమ్మడి--4/9/18
ఉ//
పోరుట తధ్యమయ్యె మరి పూనిరి యందరు నస్త్రశస్త్రముల్
కారణ మెవ్వరైననట ఖాయము జచ్చుట వారు వీరలున్!!
కౌరవ పాండవుల్ నడుమ కాంతయు నెవ్వరు నిల్చియుండిరో
భారత మందునన్సహజ వాటముఁ,దెల్పగ రండయా బుధుల్ !
సరైన జవాబు....,,దుస్సల...
("సహజ " అనగా సహోదరి.  భారతంలో కౌరవ పాడవులకు సోదరి ఎవరనేది నా ప్రశ్న)

పురాణగుమ్మడి..13-5/9/2018
ఉ//
ఎవ్వడు ప్రాణమిచ్చు, విభు డెవ్వడు గాచును సర్వకాలమున్!
ఎవ్వడు పోషణంబిడుచు ,నెవ్వడు మూలము,సృష్టి కారణం
బెవ్వడు , వానినే  మదిని యెప్పుడు దల్చుమటంచు తల్లితో
నెవ్వడు గోరెనో యపుడు నీవిధ మంతయు శోకమాపగన్
సరైన జవాబు----"హిరణ్యకశుపుడు"
(హిరణ్యాక్షుని మరణానంతరము తల్లి దితి శోకించునపుడు హిరణ్యకశుపుడు తల్లినోదార్చుతూ  అన్నమాటలు)
అ బే రా.,పేజీ  358.......7/48

పురాణగుమ్మడి 14--6/9/2018
మ,కో(షట్పది)
సంద్రమున్ మునుగంగ భూమియె శంఖపాణి వరాహమై
సంద్రమందునజేర పొట్టిడ, చర్మమే త్రయి నేర్పడన్ !
మంద్రకంమ్ము స్రువమ్ము స్రుక్కులు మంచి దంష్ట్రలు, నాసికా
రంధ్రమయ్యెను బ్రహ్మ స్థానపు రమ్యపాత్రయు ,కర్ణముల్
రంధ్రమేనట సోమరస్మపుఁ రమ్య ప్రాంతము, కొట్టగా
చింద్రమయ్యెను వైరి, యొక్కటి చెంప దెబ్బ వరాహమున్!
సంద్రమందున పోరు సల్పిన స్పర్తి ధాత్రియుఁ నెవ్వరో !!
(త్రయి=వేదము)
సరైన జవాబు,, " దితి" (హిరణ్యాక్షుని తల్లి)..(ధాత్రి=తల్లి)
(యఙ్ఞ వరాహ మూర్తితో పోరుసల్పి మరణించిన వాడు హిరణ్యాక్షుడు అతని తల్లి " దితి" )

పురాణగుమ్మడి ,,15 -7/9/2018
చం//(పంచపాది)
చదివెను గొప్ప వేదములు,శాంతముఁ, శౌచముఁ,నిత్యనైమితే
వదలెను తల్లిదండ్రులను. భార్యను.సంపద భక్తి భావమున్ !
పొదలకుచాటుఁ జేయు రతి పోకడ గాంచియు వేశ్య పొందుకై
కదలెను, కల్లు మాంసమును కమ్మగ గైకొని బ్రష్డుడాయె తా
పదిలమె విష్ణు నామమును బల్కగ ముక్తి గొనెవ్వడందురో !!
(సరైన జవాబు...అజామీళుడు
ఇతని కడసంతు నామము "నారాయణ" అవసాన దశయందీతడతని నామమునుచ్చరించుటవలన ముక్తిపొందినాడు)

పురాణగుమ్మడి 16--8/9/2018
ఉ//
వారల క్షేత్రజుండెవడు, వాసిగ నేలుచు క్షేత్రమందు తా
చేరెను కౌరవుల్దరిని చేసెను యుద్దము ద్రోహమెంచకన్
పేరిమి వీడె పోరునట భేషజమొందిన సారథీతడై
కారణమయ్యెగా నతడు కర్ణుని జావుకు నొక్కరీతిగా.
సరైన జవాబు.."రుక్మరథుడు"
వారల క్షేత్రజుండెవరు ?--( శల్యుని కుమారుడెవరు  )
(క్షేత్రజుడు-కుమారుడు)

పురాణగుమ్మడి 17--9/9/2018
చం//(పంచపాది)
రమణలఁ గూడినొక్కడు నిరంతరమాడుచునుండె నీరమున్
సమయముకొచ్చె నచ్చటకు జక్కగనొక్క తపస్వి తానమా
డ, మదముఁ, మద్యపానమున డాబునుజూపఁ మహర్షి కాలుబ
ట్టె మునిగి నీటినందు నతడే శిశుమారమునయ్యె యిట్టి  జ
న్మమునతడెవ్వరో? యతని నామమదేమి? మహర్షి నెవ్వరో?
సరైన జవాబులు...
అతడు "గంధర్వుడు".,
అతని నామము "హూహూ"
తపస్వి "దేవలమహర్షి"
(శశిమారము అనగా మొసలి)
(ఘట్టము,, గజేంద్రమోక్షము)

పురాణగుమ్మడి ..18  10/9/2018
ఉ//
భూమిజ యందురే జనులు మోదముఁ డస్సెఁ సుధన్వుఁడామెకై!!
భామిని కన్యకా మణియు  బంగరు జక్కని పేటికందు తా
భూమిని దున్నగా దొరికె బొట్టియ నాగటి చాలునందు, పే
రేమనిడంగ వచ్చునిట నేలికఁ నొందె నిశాంతనారికిన్..!!
సరైన జవాబు---- "రత్నమాల"
పై పద్యమునందున్న ప్రశ్న......,."పే
రేమనిడంగ వచ్చునిట నేలికఁ నొందె నిశాంతనారికిన్"..రాజుగారు పొందిన భార్యపేరేమని ఇక్కడ  చెప్పదగును ?
(  ఏలిక=రాజు) (నిశాంతనారి=భార్య)

పురాణగుమ్మడి..19--11/9/2018
ఉ//
అంజని కాతడున్సుతుడు హాయిగ లంకకు జేరియచ్చటన్
నంజలి లేకనే తిరిగి నాతిని కన్గొనె శోకసంద్రమున్
భంజన జేయనీతడెగ బ్రాకిన టెక్కెముఁ గూలె బూదిగా
నంజలి నొగ్గి గోరితిని నామము దెల్పను రండయా బుధుల్
సరైన జవాబు....  "కపిద్వజము"
(నంజలి-సంశయము,సంకోచము)( భంజన-వివరణము ).(టెక్కెము-ద్వజము)
అర్జనుని రథముపై జండాద్వజము "పేరు కపిద్వజము" కురుక్షేత్ర సంగ్రామమంతమున శ్రీ కృష్ణుడు  అర్జనుని రథం దిగమని కోరతాడు అర్జునుడు రథం దిగిన వెంటనే రథం కపిద్వజముతో సహా మండి బూడిద కుప్పగా మిగులుతుంది,  (జండాపై కపిరాజు)

పురాణగుమ్మడి..20--12/9/2018
మ,కో//( షట్పది)
సంతు గోరిన రాజుజేసెను సంతసంబుగ యాగమున్
సుంతనైనను ధర్మబద్దత జూపలేదు కుమారుడున్
శాంత మొందక సంతుజూసుక సాగిపోయెనరణ్యమున్!
కాంత నెవ్వరు మంత్రశక్తిడి గాచె జచ్చిన నందునిన్
వింతగాదె కళేబరంబున విష్ణువంశన బుట్టితా
కొంతకాలము నేలె రాజ్యముఁ గొప్ప కీర్తిని బొందుచున్!
సంతుగోరిన రాజుఁ,భార్యయుఁ,సంతుఁ వారలఁ దెల్పరే!!
సరైన జవాబు...... రాజు-అంగరాజు..,భార్య- సునీథ..సంతు-
"వేనుడు"వేనుడి మృతశరీరమునుండి... నిషాధుడు (బాహుకుడు)
విష్ణుమూర్తి అంశతో ఉద్భవించిన వాడు "పృథువు" మహారాజు..ఆర్చిస్సు

పురాణగుమ్మడి..21--14/9/2018
ఉ//(పంచపాది)
అబ్బురమాయె నామెకపుడద్భుత హాలుని సోదరుండు యే
నుబ్బము దీర్చియున్ శిశువు నోర్పుగ గాయగ గర్భమందునన్
నిబ్బర మందగా యపుడు నిక్కము సంతతి గల్గునంచు నా
గుబ్బిత హర్షమొందిగనె గోత్రము నిల్పగ నీతనొక్కడిన్
అబ్బిన నామమేమితని కంతట దెల్పరె మీరలందరున్
సరైన జవాబు.....  "విష్ణురాతుడు"
(ఉత్తర గర్భమున పుట్టిన బాలునకు ధర్మరాజు పెట్టిన పేరు. "విష్ణురాతుడు"శ్రీ మహావిశ్ణువు చే రక్షించ బడినాడు కావున "విష్ణురాతుడు" అనే ఈ పేరు పెట్టబడింది.
పుట్టిన పిమ్మట తల్లి గర్భమున అంగుష్ట మాత్రమై తనను కాపాడిన పీతాంబర వస్త్రములతో శంఖు చక్ర గదా ధారియైన రూపంకోసం పరీక్షగా చూచుటవలన వీరికి "పరీక్షిత్తు" అనే నామమొచ్చినది కాని అతనిపేరు "విష్ణురాతుడు"  )

పురాణగుమ్మడి..22--15/9/2018
మ.వి//
గురిచేయంబడి శాపమున్జముడు పంగున్శూద్ర ప్రోయాలుదై
కురువంశంబున బుట్టెనాతడును తాగోరెన్గదాయీతనిన్
సరియైనాతడు, బద్దజీవివలె నాసాంతంబు సూక్ష్మంబులన్
అరయున్ వేయకనన్య ప్రశ్నలను దివ్యంబైన గోవిందుడే
తరియించన్కడ మార్గమైనదని సత్యాన్వేషణన్గాంచెగా
సరైన జవాబు..."మైత్రేయఋషి"
మండూకముని శాపవశమున యమధర్మరాజే ధృతరాష్ట్రుని వలన శూద్ర వనితైన దాసీగర్భమున జన్మించిన విధురుడు.అతడు "మైత్రేయముని" వద్ద ధర్మాధర్మ,ఙ్ఞాన,తాత్విక, మేధస్సంబంధిత సత్యాన్వేషణనెరింగి .బద్దజీవిత పరమావధి దివ్యమగు శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమాయుత సేవయేనని నిశ్చయించుకొనినాడు
(భాగవతము 1 వ స్కం. 13వ అ. 1--2  శ్లో. చూడుడి)

పురాణగుమ్మడి..23--16/9/2018
మ.వి//
తహతహ్లాడుచు జారెపయ్యెద, రయిన్తాప్రేమభావమ్ముచే
బహుమోహంబున జూడ గాయెకని, యాబ్రహ్మామెఁ వీక్షించ నా
గ్రహశాపంబునఁ దేవలోకమిడి భూఖండంబు నందామెయే
సహిదేవేరిగ నెవ్వరింటి వధువై జంపేడు శిశ్వుల్నటన్
(వధువు=కోడలు)
సరైన జవాబు,,,  "ప్రతీప మహారాజు"
(వధువు=కోడలు)
(శంతన మహారాజుకు దేవేరి(భార్య)గా"ప్రతీప మహారాజు" ఇంటి కోడలు గా గంగ తన గర్భమున శాప వశమున ముందు పుట్టిన ఏడుమంది శిశువులను(అష్ట వసువులు శాపవశమున ఈమె గర్భమున పుడతారు) గంగపాలు చేసి త్వరితగతిన వారికి శాపవిమోచనం చేసి, ఎనిమిదవ సంతు భీష్ముని చంపక రాజునొదిలేసి వెళ్ళి పోతుంది  అందుకే భీష్మునకు , గాంగేయుడు  మరియు శాంతనవుడనే పేర్లు కూడా ఉన్నాయి)

పురాణగుమ్మడి..24--17/9/2018
మ.వి//
సభలో లేవని కారణంబుననె యీసామిన్ సతీదేవి తం
డ్రిభజించన్విడి ధిక్కరించుచును హాళింజేసుకుంటున్తనా
సభలో లేవని బ్రహ్మనే మనక యిచ్చన్వీడియున్నీతనిన్ !
అభిభాషించిన గోపగించనతడే, యా ఙ్ఞాన మూర్తెవ్వరో !!
సరైన జవాబు...  "భర్గుడు " 
((భర్గుడనగా తేజస్వరూపుడు,రాగద్వేషములుండక  బ్రహ్మమును తనలోతానే రమించువాడు,అర్ధనిమీలిత నేత్రుడై తనలోతానే పరవశించిపోతూ బ్రహ్మాడమంతా నిండిపోయి ఉండువాడు..ఆ సమయంలో శివుడలాఉన్నాడు కావున వారిని శివుడు.,శంకరుడు ..రుద్రుడు..అనక..,."భర్గుడు"  అన్నారు వ్యాసుల వారు.దక్షయఙ్ఞ ధ్వంస రహస్యమంతా "భర్గుడు" అనే నామములోనేయున్నది)

పురాణగుమ్మడి..25--18/9/2018
ఉ//
ఆతని నామమెంతరుచి యద్భుత మాతడు సర్వ ప్రాణికిన్ !
ఆతని పాదధూళి గొని యాయెను రాతియె నాతి రూపుగా
నాతడరణ్యమేగుటకు నాతియె కారణమయ్యెచేటి తా
నేతది నాటిమాటనె గొనిప్పుడు దీర్చమనెవ్వరన్నదో! !
సరైన జవాబు..."మంధర"
(చేటి--దాసి,పరిచారిక)

పురాణగుమ్మడి..26--19/9/2018
ఉ//
వారలు మిక్కుటంబుఁ సుర పానము జేసిన కారణంబుచే
నారద శాపమున్బడసి నందుని వాకిట భూరుహంబులై
నేరము మోయుచున్నిలచె నెవ్వరు సూనులు పైడిఱేడుకున్
భారము బాపగృష్ణుడట పావను లయ్యిరి స్పర్శచేతనే
సరైన జవాబు...నలకూబర,..మణిగ్రీవులు

పురాణగుమ్మడి..27--20/9/2018
ఉ// పంచపాది
యాగఫలంబుచేత నతడయ్యెనె యింద్రుడు స్వర్గలోకమున్
వేగమె పొందగోరితడు బిల్చెను పొందుకు నింద్ర పత్నికిన్
బాగుయె రమ్మనామె శచి, పల్లకి మోయుచు సప్తఋష్యులే
సాగగ, వేగిరంబు "నడుసర్ప" యనంచును దన్నెనెవ్వనిన్
భోగము దక్కినా యెవరు బొందెను శాపము గోనసమ్ముగా!!
సరైన జవాబులు
1)అగస్త్య మహర్షి
2)నహుషుడు

పురాణగుమ్మడి--28--21/9/2018
చం//
శరణని గోరె స్వామి ధ్వజిఁ జాలరచేతి వలందు జిక్కగా!
మరిచెద నిచ్చినన్తన సమానమునైనది యేదిగాననన్
మరివియె యంచు గొప్పగను మాడలు వేయియు,కోటి,రాజ్యమం
తరిపితమివ్వజూపినను తాసరినొల్లక నొల్లెనెట్టులన్!!
సరైన జవాబు..,,"గోవు నిచ్చిన"
తనకు సమానమైన విలువ "గొవు" అని జాలరుల వలలో చిక్కిన   చవ్యనుడు (బ్రాహ్మణుడు) నహుషుడనే రాజు గోవునిచ్చినపిమ్మట సంతుష్టుడాయెను)

పురాణగుమ్మడి--29--22/9/2018
సీ//
అడుగగ తడవడె యామెయఙ్ఙము జేసి 
     యడుగనెవడొ వాడెయడిగె నామెఁ
కొడుకుగ బుట్టగ కూరిమి తోడను
      అడిగిన తడవున నామె యొప్పఁ
బుడిబుడి నడకల బుడతడు బుట్టెను
      యడుగిడి యడిగెను యఙ్ఞ మందు
మూడడుగులిడిన పుడమది జాలని
      అడిగిన నిచ్చెడి యసుర ఱేడుఁ
ఆ.వె
వటువు గొచ్చె నెవరొ వారినెరిగిగుర్వు
జొచ్చె దార కడ్డు, గుచ్చ దర్భ
వటువు పుచ్చె గన్ను, వార్చెనెవరు దార
దాన కీర్తి బడయ దానవేంద్ర !!
సరైన జవాబు ---"వింధ్యావళి"..వార్చెనెవరు దార?
(దార=నీటి దార,దార=భార్య..)నా పద్యములో రెండవ సారి వాడిన "
"దార" అనే పదమును  నీటిదారగా గైకొనినా...లేదా..భార్యగా స్వీకరించినా  జవాబులో మార్పు రాదు   కావున   మూడడుగుల నేల దానమొసంగిన బలి చక్రవర్తి అర్ధాంగి  "వింధ్యావళి" యే నేటి సరైన జవాబు.

పురాణగుమ్మడి--30--23/9/2018
ఉ//
జీవుడు దేహదర్మముల జేయుచు నుండును జన్మజన్మముల్?
కావున సార్ధకంబుగను గైకొను కర్మల  పాపపుణ్యముల్ !
దేవుని సంప్రసాదమున దీరును పాపము పుణ్య బంధముల్!
ప్రోవుకొనష్టసంపదల భోగము లన్నియు దైవరూపమున్!
బావుకొనంగనేమి హరి పావన రూపము నివ్విధంబుగన్!!
సరైన జవాబు.."ముక్తి"
(సార్ధకము=ఫలితము,)(సంప్రసాదము=దయ)(బావుకొను = పొందు,అనుభవించు)(పావన=పవిత్రమైన)
(పో..భాగ..2-266 చూడగలరు )

పురాణగుమ్మడి--31--24/9/2018
ఉ//
విద్యలు నేర్చెను భీష్ముడా ధ్వజి వీరునొద్దనె గొప్పగా
విద్యలు నేర్చెను గర్ణుడా ధ్వజి వీరునొద్దనె గొప్పగా
విద్యలు నేర్చెను ద్రోణుడా ధ్వజి వీరునొద్దనె గొప్పగా
విద్యలు నేర్పిన దృత్వుడే మొనబెట్ట నొక్కడు కోమలుల్
మద్యన దాగియు దక్కె, వాని సమాహ్వమేమది దెల్పరే
సరైన జవాబు...   "మూలకుండు" 
("నారీ కవచుడు" పైకారణమున వచ్చిన నామము)
(మొన=యుద్ధము )(సమాహ్వ=పేరు)
(పో.భాగ----- 9/252..చూడుడి)

పురాణగుమ్మడి--32--25/9/2018
కం//
ఎంచగ నైదట మాత్రలు
మంచిగ భూతము లునైదు మానిసి కొరకున్
ఎంచైదింద్రియములుఁ సృ
ష్టించ విరాట్టపురుషుండు, చెప్పుమదేమీ? 
సరైనన జవాబు..."సర్గము"
(పో .భాగ/2/259  చూడగలరు)

పురాణగుమ్మడి--33--26/9/2018
మ.కో//
ఎంత కాలము నేలరాజ్యమిదేమి భాగ్యమనెంచి తా
శాంతికై పులహాశ్రమందున చారునేత్రముఁ మాయలో
భ్రాంతితో మరుజన్మమెత్తియు బాపనయ్యకు సూనుడై
శాంతమూర్తిగ మోసె నెవ్వరు సాధువెవ్వరి పల్లకిన్
సరైన జవాబు,,,
పల్లకీ మోసినది..,., "జడభరతుడు"
పల్లకీలో నున్నది,,,, "రాహుగణుడు".అనే రాజు.
(భరతుడు మోసిన పల్లకీలో కూర్చున్నఅ రాజు ఎవరు అని నా ప్రశ్న)

పురాణగుమ్మడి--34--27/9/2018
ఉ//
ఏలగ పోరుసల్పెనట నిద్దరు,గూల్చెను రామబాణ మా
యేలెడివాలిఁ ,సోదరుడె యేలగ వచ్చెను రాజ్యమంతటిన్!
"ఏలిక యేలగూల్చితివి యేమిది ధర్మము చెప్పమంచు"తా
గూలుచు నొక్కటే వరము గోరెగ యాతడు నేమిటందురో !!
సరైన జవాబు.,,"అంగదునికి సంరక్షణ  కోరెను"
(వాలి తనకుమారుడైన అంగదుడు బంగరు భుజకీర్తులు కలవాడని తనవలె బలాఢ్యుడని,తనకు తారవలన కలిగిన పుత్రుడని విన్నవిస్తూ సుగ్రీవుని వలె ప్రేమాభిమానములతో సంరక్షించమని  కోరాడు అవసాన దశలో)

పురాణగుమ్మడి--35--28/9/2018
కవికంఠభూషణ//
యుగధర్మమేమొ మనయూహకునందక యున్నదొక్కటే
విగతంబుగాయె తనువెట్టము గాడుగ ఱేడు కేవిధిన్
తగవేదిలేక ఘనతాపసిఁ ద్రుంచ కుజాపతే, యదే
యెగజీవిఁ గాసె యిట యెవ్వరుగూలె విలంబి దెల్పరే
సరైన జవాబు..,"శంబుకుడు"

పురాణగుమ్మడి--36--29/9/2018
ఉ//
వేలుపు నొగ్గడించనిర విడ్వడె ప్రాణులు రెండుతీరులన్
కూడియు పూజసేతుమన గోముగ వారలు యక్షులవ్వగన్
కూడియు రక్షనెంచుకొని కొల్వని వారలు రాక్షసాగ్రణుల్
ఏలగ జొచ్చెయోధులట నిర్వురు రాక్షస వీరులెవ్వరో
సరైన జవాబు..."హేతి".."ప్రహేతి"
(వా.రా/ ఉ.కాం/1-అ/4వ. స/9-15 శ్లో.)

పురాణగుమ్మడి--37--30/9/2018
మ.కో//
వైరి పక్షము నందు జేరియుఁ బ్రాత గుట్టునుజెప్పుచున్
నేరమన్నది జేయకెన్నడు నిత్య ధర్మ ప్రబుద్ధుడై
వారికే ఘనతిచ్చి మెండుగ వారి పక్షమె పోరి తా
నేరుగాతను రాజ్యలక్ష్మిని నేలె నెవ్వరు దెల్పరే
సరైన జవాబు ..."యుయుత్సుడు"
(ధుర్యోదనునికి  సోదరుడు,. కాని పాండవపక్షమున జేరి కౌరవులతో పోరు సల్పి బ్రతికున్నవాడు ఇతడొక్కడే.. ధర్మ నిరతుడు.యోధుడు కౌరవులతరపున ఉన్న 11 మంది యోధులలో ఇతనొక్కడే బ్రతికి ఉన్నవాడు కురుక్షేత్రసంగ్రామానంతరము పరిక్షిత్తునకు సంరక్షకుడుగా రాజ్యభారము మోసినాడు.ఇంద్రప్రస్థానికి ధర్మరాజు ఇతనిని రాజునిచేసినాడు.

పురాణగుమ్మడి--38--1/10/2018
ఉ//
సంగముఁ శ్వేతశైలమున స్కందుని జన్మము నివ్విధంబుగన్
అంగతి శాపమున్ బడసె నంబిక యివ్వగ కోపతాపమున్
పొంగగ ధాతువీతనిదె బుట్టుటకాద్యము నాయెనంచతిన్
గంగయు మోయజాలకిడ గాసెను తేజనమెవ్వరందురో
(ధాతువు = వీర్యము)..(అంగతి=అగ్ని ) (అంచతి=అగ్ని)(తేజనము=రెల్లుగడ్డి)
సరైన జవాబు.."శివుడు"
స్కందుని జన్మము గురించేకదా నాపద్యము .. శ్వేతశైలము..స్కందుడు...పార్వతి... అగ్ని..గంగ....రెల్లుగడ్డి ఇవన్నీ నేనే చెప్పాగదా...ఈ పద్యములో  ప్రశ్న "ధాతువీతనిది బుట్టుటకాద్యము నాయెనంగతిన్  "?అనగా ముందుగా  అగ్నియందు పుటుకకు మూలమైన వీర్యము ఇతనిది.  ఎవరిది -శివునిది..,కావున సరైన జవాబు  "శివుడు"

పురాణగుమ్మడి--39--2/10/2018
ఉ//(షట్పది)
కాయగ నిచ్చెఁ బాహులము ఖాండవ భక్షణఁ వృద్ద బ్రాహ్మడై
జేయగ బూని ,దీనిగొని జిష్ణువు గూల్చెను పెక్కువీరులన్ !
నాయక గాంచి వీరులను "నాతరమా స్వజనంబు గూల్చగన్ 
పోయిననేమి?రాజ్యసిరి పోయెద నే"నని వీడి దానినిన్
చేయక యుద్దమున్ నిలువఁజెప్పుచు గీతను పార్ధసారధై
సాయము జేసె పోరితముఁ సామియె పాండవ సిద్ధి గోరియున్!!
సరైన జవాబు,.,,.," గాంఢీవము"...
(బాహులము=అగ్ని ,జిష్ణువు =అర్జనుడు,.పోరితము=యుద్ధము, సిద్ధి=గెలుపు)

పురాణగుమ్మడి--40--3/10/2018
మ.కో//
సీతజాడ గొనంగ దూకియు చేరె లంకకు, శైలమం
తాతడున్గొనిదెచ్చి గాసె రణంబుఁ జొక్కిన లక్ష్మణున్ !
ఆతడే వడలంత సింధురమద్దుకున్నతి పావనుం
డాతనల్లనుగోర నేనిట నామమేమది దెల్పరే !!
సరైన జవాబు--- "అంజని" 
(అల్ల అనగా తల్లి)(ఆతని+అల్లను..ఆతనల్లను)నేనడిగినది ఆంజనేయుని తల్లి పేరు.....కావున "అంజని" సరైన జవాబు.

పురాణగుమ్మడి--41--4/10/2018
ఉ//
చెంతకు జేరి రావణుడు జేసియు మాయలు మోసగించగా !
చెంతను లేడు భర్త, తనుచేడియ నొంటరి, సత్యశీలికిన్
చింతను రూపుమాప తనుఁజేకొనె కార్యము భర్తతీరు నా
కాంతకు యుద్దమంతమవఁ గల్గెను పట్టపురాణివాసమున్ !
వింతయె లేదుగా యిచట వేగముఁ దెల్పరె యెవ్వరందురో !!
సరైన జవాబు..."సరమ"
విభీషణుని పత్ని.విభీషణుడు శ్రీరాముని చెంత జేరినను ఈమె లంకాపురినే ఒంటరియయై యుండెను.యుద్దప్రారంభమునకు ముందు మాయావి యైన దశకంఠుడు శ్రీ రాముని శిరస్సును బోలిన శిరస్సును ధనస్సును బోలిన ధనుస్సును చూపి సీతాదేవిని భయబ్రాంతులకు గురిచేయగా మిగుల చింతతో దుఃఖించు సీతను ఒదార్చి నిజానిజము లెరింగించినది.యుద్దానంతరమున లంకాపురికి పట్టభద్రుడైన విభీషణునికి పట్టపు మహిషి ఈమెయేకదా.
(వా.రా/యు.కాం/33 వ సర్గ/1--5 శ్లో)

పురాణగుమ్మడి--42--5/10/2018
మ,వి//(పంచపాది)
సకలం భూమియె సృష్టికార్యములతో సాధించఁ భూరేడు నా
సకలోత్తమ్ములయందు మేటి ధ్వజి సంసారంబు జేయంగనై
యొకనందంతి నొసంగ నామెనిమిదీయొక్కాడు సంతున్గనం
త కడన్గోరగ బుర్షుసంతు గల్గెగా, నామంబులన్ నాలుగే
నికరం జేసితి దెల్పరే బుధులు నేనీపద్యమంతంబుకున్
సరైన జవాబు ఈ పద్యములో ఉన్నవారు
1)"స్వాయంభువు మనువు"(రాజ వంశము)భూరేడు
2)"కర్దమ ప్రజాపతి" (మహాయోగి పుంగవుడు,ఙ్ఞాని,ప్రజాపతి,)ధ్వజి
3)"దేవహూతి"(స్వాయంభువు మనువు కుమార్తె)
4)"కపిల మహర్షి"(  కర్దమ ప్రజాపతి--దేవహూతిల  కుమారుడు శ్రీమన్నారాయణుడే ఈ రూపున జన్మించాడు) పురుష సంతుగా

పురాణగుమ్మడి--43--6/10/2018
మ.కో(పంచపాది)
మౌని యీతడె శాపమిచ్చెను మారుజన్మపు గొట్టుకున్ !
మౌనియై యొకరాజు పర్వతమందుపాసన జేయుచూ
దైనికంబును సేయకార్యముఁ తానులేవక గాంచియున్
మౌనిరాకను, పూజ సేయక మౌనమొందగ నంతటా
మౌనిశాపముఁ బారబుట్టగ మారుజన్మముఁ హస్తిగా !!
(గొట్టు=విరోధి)
సరైనజవాబులు..."దేవలమహర్షి"
"అగస్త్యమహర్షి""ఇంద్రద్యుమ్న మహారాజు"ను
ఏనుగై పుట్టమని శాపమిచ్చిను కాని నేనడిగినది మారు జన్మలో హస్తి విరోధైన ముసలికి శాపమిచ్చన దీతడే   ఆయీతడే ఎవరు అని కావున "దేవలమహర్షి" సరైన జవాబు "(ఘట్టము,, గజేంద్రమోక్షము)

పురాణగుమ్మడి--44--7/10/2018
ఉ//
కమ్మగ పువ్వులిచ్చు బహుకాయలుఁ ,నీడను బంచునట్టి యా
కొమ్మకె నీరువోసెదని గొప్పగ జెప్పుట నొల్లదట్లునే
మమ్ముల గోరనేమి ఫలమబ్బదు వేల్పునె గోరమంచు తా
నిమ్ముగ బల్కగా వినినదెవ్వరు? వాక్కులనన్నదెవ్వరో?
సరైన జవాబు,,"ఇంద్రుడు","బ్రహ్మ"
(పో.భాగ  8/156)

పురాణగుమ్మడి--45--8/10/2018
చం//(పంచపాది)
వినవలె సంతసంబుగను వేడుకఁ మిక్కిలి కీర్తిజేయుచున్
తనదు శరీర భాగములు తాకగ భూమిని మ్రొక్కి వైభవం
బున వెలుగొందు యీశ్వరుని పొందుయు చేరువనున్నదన్న భా
వన గలబోసి తొమ్మిదిట భక్తిగ స్వామియునొక్కడేననెం
చిన తనవిద్య భావమును జేరియు దండ్రిఁకి దెల్పెనెవ్వరో!
సరైన జవాబు....ప్రహ్లాదుడు
(పో.భా/7-166)మరియు చాగంటి భాగవత ప్రవచనము..371&372 పేజీలు)

పురాణగుమ్మడి--46--9/10/2018
ఉ//
ఎవ్వరు సర్వ పాపహరుడెవ్వరు సర్వ స్వరూపుడైన తా
నెవ్వరు కైటభారి,విధి నెవ్వరుపాదులు లేకయుండు తా
నెవ్వరు కల్పమంతమున నీరధి యందున శేషపాన్పు పై
నెవ్వరు చిద్విలాసమున నేలుచు నుండు స్వయంభువందునే
తివ్వవ జీవకోటి ఘన  తేజమునంతయు నీవిధంబగున్
సరైన జవాబు..."నిరోధము"
(అవాంతర ప్రళయమనికూడా అంటారు)
పో.భా/2--265

పురాణగుమ్మడి--47--10/10/2018
ఉ//
తక్కువ యున్నదేనిరిపు దండును యుద్దము మేలుగూర్చుగా
మక్కువ గూడదెన్నడది మచ్చరి సాహిణమెక్కువున్నచో
నిక్కము నీతిశాస్త్రముల నెర్గిన యేలికె సంధి కోర్చియున్
చక్కగ వృద్దిజేయు తన సైన్యముఁ దక్కిన కాలమందునన్
చక్కగ సంధి జేసుకొని శాంతము నొందుమనన్నదెవ్వరో !!
సరైన జవాబు.."మాల్యవంతుడు"
(రావణాసురిని పినమాతామహుడు.కైకసి పినతండ్రి,వృద్దమంత్రి ఈ మాల్యవంతుడు)

పురాణగుమ్మడి--48--11/10/2018
భూతిలకము//
ఏలిక నొక్కడులేడు మాకిట నేలికొక్కని నివ్వమం
చేలిక చెంతకు యేలుకోటియుఁజేరి గోరగ నల్వ ది
క్పాలికలందరి యంశనొక్కటిగా గొనంగనె ఛిక్కు నొ
క్కేలిక నుద్భవమొందె, నీవిధమేలికీతడె యాదినన్!!
సరైనజవాబు.,"క్షువుడు"
(వా.రా/ఉత్తరకాండ/76 వ సర్గ/37--43  శ్లో.చూడుము)

పురాణగుమ్మడి--49--12/10/2018
పంచచామరము//
పరాభవం బెరుంగనట్టి ప్రాభవంబు గల్గియే
స్వరూప, సద్గుణంబు, శక్తి, స్వామిఁ యెల్లవేళలం
దు రేత్ర పత్నమవ్వనట్టి నొక్కవానిఁ బిల్తు రం
దరీ విధంబుగా నదెయ్యదందురో నొసంగరే
సరైన జవాబు...."అచ్యుత"
(భగవద్గీత 1/21)

పురాణగుమ్మడి--50--13/10/2018
కవిరాజవిరాజితము//(షట్పది)
మధురము లోక సమస్త జనాన, సమాజముకై మురమర్దుఁ గళం
బిదిమన ప్రాప్తముఁ బెన్నిధినాయెగ పెక్కగు రీతుల, బేలతనం
బదివిడనాడ ప్రభావ మొసంగు నెవానికి నైనిది పావనమున్
కదనము రంగపు గర్తయె సారథిగై మనకిచ్చిన కానుకిదే
వదలకనెవ్వడు భావపు సారముఁ బట్టునొ ధన్యుడె వాడెపుడున్
ముదమున  గోరితి ముందటి శ్రోతను ముద్దుగ దెల్పరె మోహరమున్
సరైన జవాబు...."అర్జునుడు "

పురాణగుమ్మడి 51-14/10/18
ఉ//
"జీవునికెంత కోర్కెతను జిర్విని బట్టగ యాశవీడియున్
పోవగ నిచ్చగించడుగ బూర్వులు సంతతి నస్తమించినన్,
నీవును ప్రాణమివ్వవలె నెన్నడునైనను గీము, బంధముల్
కావవు క్షేత్ర ,గౌరవము, కాసులు, భోగముఁ, కాలరూపమున్
గావగ నొక్కడే గలడు ఖాయము" గన్నది నెవ్వరెవ్వరిన్
సరైన జవాబు...."విధురుడు..ధృతరాష్ట్రునితో"
కురుక్షేత్ర సంగ్రామమనంతరము పాండవుల సంరక్షణలో జీవిస్తున్న దృతరాష్ట్రునికి విధురుడు నీతిబోధ చేసినాడు ఆసందర్భములో ని కొన్ని మాటలివి.
(భాగ 1/13/19--20 )

పురాణగుమ్మడి 52-15/10/18
ఉ//(పంచపాది)
వచ్చిరి సన్కసాదిముని వర్యులు గాంచిరి నగ్నరూపమున్
అచ్చెరువందగా నగజ, యంత "వనంబున నెవ్వరేని తా 
జొచ్చిన మారు తధ్యమిది జోటిగఁ," శాపమొసంగె శంభుడున్
చొచ్చిన తోడనే నొకరు చోద్యముఁ మారెగ యింతి రూపుగన్
జొచ్చిన వారలెవ్వరట? జోడుగ నెవ్వరు? సంతతెవ్వరో?
సరైన జవాబులు..సుద్యుమ్నుడు..ఇళ-బుధుడు..పురూరవుడు
చొచ్చి స్త్రీ గా మారిన వారు:-సుద్యుమ్నుడు
జోడుగ నెవ్వరు:- ఇళ,బుధుడు( స్త్రీ రూపములోకి మారిపోయిన సుద్యుమ్నుడే ఇళ, వీరిరువురు గాంధర్వ వివాహం చేసుకున్నారు
సంతతెవ్వరు,, :-.....వీరికి పుట్టిన వాడే "పురూరవుడు",వీరి సంతు

పురాణగుమ్మడి 53-16/10/18
ఉ//
వేటకుబోయి యాప్రభువు వేగెను దాహము చేతనే! తనే
యాటగ జచ్చినొక్కఫణిఁ నాముని కంఠమునందు వేయగా
వాటముఁ శాపమిచ్చెముని బాలుడు, "జావగ పాముకాటుతో" !
కీటక రూపుతోడజని గిట్టగ కాటును వేసె వేల్పుకున్
వేటకు వేగెనెవ్వరట వేసినదెవ్వరు కాటు నాతనిన్ ?
సరైన జవాబులు..పరీక్షిత్తు....తక్షకుడు
వేటకు వెళ్ళినది..."పరీక్షితు మహారాజు"
శాపవచమున పరీక్షితును  కాటువేసి చంపినది,,."తక్షకుడు"

పురాణగుమ్మడి 54-17/10/18
చం//
గురువు తపస్సు కేగెనట కోరియు దానవ జాతి క్షేమమున్
మరులొక నింతిపై బడగ మారెను భర్తగ నాతడచ్చటన్
సురల గురుండుఁ జేరెనటసుర్ల గురేసముఁ మోసగించగన్ !
సురలసురల్గురుల్ యెవరసుర్గురునాలిగ నిల్చెనెవ్వరో?
సరైన చవాబులు
   1)బృహస్పతి   2)శుక్రాచార్యుడు 3) జయంతి ( ఇంద్రుని కుమార్తె)

పురాణగుమ్మడి 55-21/10/18
ఉ//
"రాజ్యము శక్తిహీనమగు రాజుయె లోకము వీడిపోయినన్
భోజ్యమె చార చోరులకు,భూరిగ స్పర్ధలు విల్లసిల్లుచున్
రాజ్యముఁ వర్ణసంకరము రాజిలు,వైదిక వర్ణధర్మముల్
పూజ్యమె యర్ధకామముల పోరులు హెచ్చగు"నన్నదెవ్వరో
సరైన జవాబ.,"శమీకమహాముని"
మృత యురగ కళేబరము తన తండ్రిమెడలో వేసిన పరీక్షిత్తు మహారాజును ఏడుదినముల లోపల మరణించునట్లు శాపమిచ్చిన తనకుమారుడైన శృంగి మునితో శమీకమహాముని అన్న మాటలు.
(పో,భా/ప్ర.స్కం/424 చూడుము)

పురాణగుమ్మడి 56-22/10/18
ఉ//
రాండయ దెల్పగా నితని రౌద్రము జూపెడి శుక్తిఁ, జూడగా
ఖాండవ కుందిలమ్ము తను గాసియుఁ బొందెను కాలపృష్ఠమున్
పాండవ మద్యముండితడు పాటవ మొందియు గొట్టయంత్రమున్
పాండవు లందరొందె సతిఁ,బావయె యీతని సారథాయెగా
సరైన జవాబు..దేవదత్తము  (శుక్తి=శంఖము)
(అర్జునుని శంఖము పేరు దేవదత్తము)

పురాణగుమ్మడి 57-23/10/18
ఉ//(మాలిక)
తెచ్చెను తారిషంబుయట తీరగు బచ్చని పట్టు పుట్టముల్
గుచ్చిన వైజయంతి సరి గూర్చెను జక్కగ పాశహస్తుడున్
తెచ్చెను కింకిణీ బసిడి తీవెల కంకణ విశ్వకర్మయున్
ఇచ్చె విధాత, శారదయు యిచ్చపు పద్మము, తారహారమున్
తెచ్చిరి నాగరాజులట తీరు వజ్రాల సుకుండలంబులన్
మెచ్చియు యష్టదిక్కులకు మేలగు కాంతలు దీవెనివ్వగా
అచ్చరువేదియున్బడక యందుకొనెవ్వరు దెల్పరండయా
సరైన జవాబు..;లక్ష్మి దేవి"
(క్షిర సాగరమధనమున లక్ష్మి దేవి ఆవిర్భావము జరిగిన పిమ్మట శ్రీమహావిష్ణువు చెంతకుచేరేసమయంలో)

పురాణగుమ్మడి 58-24/10/18
ఉ//
పాండవ పక్షమున్నిలచి పన్నగ వ్యూహముఁ వ్యూహకర్త,తా
పాండవ పత్నితో గలసి భావము నొందెను యఙ్ఞమందు,శూ
రుండు ప్రజాపతీతనికి,రోషము బాసియు తండ్రి వైరికిన్
మొండెము వేరుజేసె మృతమొందిన పిమ్మట యుద్దమందునన్ !!
సరైన జవాబు..దృతకేతువు.
ప్రజాపతి=తండ్రి
ఇతనికి "ప్రజాపతి"అనేది నా ప్రశ్న పద్యమునందు.(దృతకేతువుకు తండ్రి  ధృష్టద్యుమ్నుడు)

పురాణగుమ్మడి 59-25/10/18
ఉ//
శాపవశంబుచే జముడు సద్గుణ ఙ్ఞానసమోన్నతుండునై
శాపపు కాలమంతయును జక్కగ మానవ వంశజుండవన్
పాపుల దండనంబిడెడి పట్టము శూన్యము గైనకాలమున్
ప్రాపుయుఁ బట్టెగా యితడు పాపుల కార్యము నిర్వహించగన్
సరైన జవాబు,,,"అర్యముడు"
(యమధర్మరాజు మండూక ముని శాపకారణమున శూద్ర వనిత గర్భమున విధుర నామంబున జన్మించి ధృతరాష్ట్రు.,పాండురాజుల సోదరునిగాను, మైత్రేయ ముని వద్ద సద్గుణ ఙ్ఞన సముపార్జనచేసి  కవురవులకు ఆధ్యాత్మిక గురువుగా,  ఉన్నాడు.ఆ కాలములో మయధర్మరాజు స్థానమును అతనిచే చేయబడు కార్యములను "ఆర్యముడు" చేపట్టి నిర్వహించినాడు.,అదితి కశ్యపుల సంతతిలో నితడొకడు)
(భాగ...1 వ స్కం,13 వ అ,15వ శ్లో. చూడుడు)

పురాణగుమ్మడి 60-26/10/18
ఉ//
గద్దియ నిచ్చిపాద్యమును కమ్మని యార్ఘ్యము నందజేసియున్
శుద్దిగ తీర్ధమాటయును. సోకున చర్చన మద్దజేయుటన్
బుద్ధిగ ధూప దీప తిరుబోనము వీడ్యమునందజేసియున్
కొద్దిగ నీరమున్ వసన గ్రొత్తగ భూషణమర్పితంబుచే
ఒద్దికఁ పుష్ప గంధముల నొప్పియునంతట నాచమించియున్
నిద్దురచేయ సంస్తరము నేర్పడ జేయగ నీవిధంబగున్
సరైన జవాబు..."షోడశోపచారములు"
(ఆసన-పాద్య-ఆర్ఘ్య-స్నాన-అనులేపన-ధూప-దీప-నైవేద్య-తాంబూల-శీతోదక- వసన-భూషణ-మాల్య-గంధ-ఆచమనీయ- తల్ప సమర్పణములు షోడశోపచారములందురు)

పురాణగుమ్మడి 61-27/10/18
భూతిలకము//
శాపవశంబున నొక్క యచ్చెర సాగిపోయెను చేపగా
శాప విమోచన గల్గెనింతికి సంతతొందగ నిర్వురున్
చేపల కంపున దిర్గునందొక చిన్నదాయెను రూపుగన్
తాపసి యొక్కని కామతూరితఁ దానుపొందెను సూనునిన్
శాపవిమోచిత యెవ్వరెవ్వరు సంతు, తాపసి, సూనుడున్
సరైన జవాబులు..1)అద్రిక..2)మత్స్యరాజు ,కాళి 3)పరాశరుడు ,,4)వ్యాసుడు
1)అద్రిక
(ఒక అప్సరస సంధ్యావందనమాచరించు విప్రుని శాపమొంది చేపగా మారిపోయినది)
2) మత్స్యరాజు ,కాళి (ఇమెనే మత్స్యగంధి, సత్యవతి అనికూడా అందురు) చేపసంతతి..దాశరాజు వద్ద పెరిగిన వారు)
3)పరాశరుడు ,,
(తాపసి  మత్స్యగంధిని గాంచి కామమోహితుడైన ఋషి)
4)వ్యాసుడు
(మత్స్యగంధికి పరాశరుని వలన కలిగిన కుమారుడు.వేదవ్యాసుడు,ఙ్ఞాని,వేదములను నాలుగు భాగాలుగా విభజించినాడు కావున వేదవ్యాసుడైనాడు)

పురాణగుమ్మడి 62-28/10/18
తరళము//
బొటన వ్రేలున నుద్భవించెను బొట్టియొక్కటి బ్రహ్మకున్
అడుగు లేసినదామె దక్షుని హస్తమందియు నాలిగా
బడసె వేలుగ సంతతిన్తను  బ్రహ్మయానతి నివ్వగా
కటువు మాటల నాడగాముని ఖాయమయ్యెను శాపమున్
కడుపు పంటగ,బుట్టెనెవ్వరు గర్భ వాసము నెవ్వరిన్
సరియైన జవాబులు..1)వీరిణీదేవి..2)నారదుడు
1)వీరిణీదేవి (దక్షుని భార్య , బ్రహ్మ బొటన వేలు నుండి పుట్టినది)
2)నారదుడు(వీరిణీ దక్షుల అధిక సంతానమునవహేళన చేయుటచే దక్షుని శాపమువలన వీరికే కుమారుడుగా పుడతాడు నారదుడు.)
(దే.భా 7 వ స్కం. నారదునికి దక్షుని శాపము కథాంశము  బే.రా బ్ర,   దేవీ భా.పేజీ..483-484)

పురాణగుమ్మడి 63-29/10/18
ఉ//
ఏమిది పాపకృత్యముల నెందుకు జేయుట మేమెరుంగకే
తామది రాజకార్యముల దప్పక నెంచును నిశ్చయాత్మజుల్
ఏమనుశోకమొందరుగ యిట్టి ప్రజాపతి పిమ్మటెప్పుడున్?
ధీమతహంకరించగ నదెప్పుడు మేలగు వైరిపక్షమే!
ఏమియు తోచుచున్నదిట నెవ్వరు బల్కిరి యిట్టి పల్కులన్
సరైన జవాబు..."కుంభకర్ణుడు"
వా.రా/యు.కాం/12 వ స/ 28--32  శ్లో.

పురాణగుమ్మడి 64-౩0/10/18
ఉ//
యక్షుల వంశమందుననె యక్షిణి బుట్టెను బ్రహ్మకానుకన్ !
రక్షణ వేయి యేనుగుల ప్రాణము నామెకు వెల్పునిచ్చెగా !
యక్షుడు నొక్కడొందతన యాలిగ నీమెకు పూజ్యుడీతడే !
యక్షిణగస్త్యశాపమున నయ్యెను రక్కసి, రామచంద్ర గో
రక్షణ, బ్రాహ్మణోత్తముల రక్షణ గోరియుఁ గూల్చెనామెనే !
(పూజ్యుడు=మామ)
సరైన జవాబు "జంభాసురుడు"
(సుకేతుడను యక్షుని కుమార్తె తాటకి బ్రహ్మ వరప్రభావముచే వెయ్యి యేనుగుల బలముకలది .జంబాసురుడను యక్షుని కుమారుడు సుందుడను వాడు ఈమెభర్త.,మారీచుడు ఈమెకొమరుడు.సుందుడు అగస్త్యుని వలన మృతి చెందగా మారీచుడు,తాటకి అగస్త్యుని చంప యత్నించగా అగస్యముని శాపవచనమున రక్కస రూపులైరి.రామచంద్రుని శరాఘాతములచే మృతినొందిరి)
(వా.రా/బా,కాం/25 వ స/8-9 శ్లో.)

పురాణగుమ్మడి 65-౩1/10/18
ఉ//
ధర్మపు కర్మలాచరముఁ తాను మహానిరతుండు పాఱుడే !
ధర్మపు సూక్షమర్మములగొనె తాపసి గౌతముఁ చెంతజేరియున్ !
నిర్మల దైవసేవనమునెర్గియుఁ లేవడు గుర్వురాకకున్
ధర్మముకాదు గుర్వుయెడఁ దల్చియు శాపము నిచ్చెనెవ్వరో?
సరైన జవాబు.."శివుడు"
(స్కందపురాణంతర్గత రామాయణ మహాత్యమ్ 2వ అధ్యాయం,,30..36 శ్లో.)

పురాణగుమ్మడి 66-1/11/18
తరళము(పంచపాది)
మదపుటేనుగు తాను, వంశ క్రమంబె దానికితొండమున్!
మదము దాని పరాక్రమే, బలమైన దోషలు దంతముల్!
మదపు గంధము సోకినంతనె మర్లుతక్కిన యేనుగుల్!
మదపుటేనుగు చూడనెవ్వరి మానసంబది యొప్పునే?
మదపుటేనుగు రామచంద్రుడు మానుకయ్యమనెవ్వరో?
సరైన జవాబు.."మారీచుడు"
వా.రా/అర,కాం/31వ,స/46వ శ్లో చూడుము

పురాణగుమ్మడి 67-2/11/18
ఉ//(మాలిక)
మేడలు గోపురంబులట మిద్దెలు బంగరు రంగు కేతువుల్
పూలు,ఫలంబులిచ్చుబహు పొట్టెములూగెడి కల్ప వృక్షముల్ !
పూలను జేరి తేనియకు పోగిడు ఝుమ్మను తేనెటీగలున్
నీలపు వర్ణశోభితముఁ నెమ్మది వర్తన దివ్య దేహముల్
గోళపు కంఠహారములు, కుంపెన, యందెలు, పట్టుపుట్టముల్
దాలిచి సేవలర్పణముఁ దాపున నుండగ సేవకాజనుల్
పాలన జేయుచుండు పరిపాలకుడొక్కడు నిచ్చటే గదా!
బాళిగ నెంచి మీరలిట భావము దెల్పిన భాగ్యమబ్బదే !!
సరైన జవాబు.."వైకుంఠము"
(పో.భాగ  2/227--230)

పురాణగుమ్మడి 68-3/11/18
ఉ//
ఛందము నందునే మిగుల జక్కగ నొప్పెను గ్రంధమంతయున్ !
అందము పొందెనన్నియు సమాక్షర శ్లోకములిందుగాంచినన్ !
కొందరి నీతి గాథలవి కొల్లలు దాతృసుతుండు స్పష్టతన్ !
అందగ పల్కులాతనివె యల్లెను గ్రంధము మౌని వేడుకన్!
విందుగ దక్కెలోకముకు వింతగు యుద్దపు రీతులెన్నియో!
సరైన జవాబు ..,"బ్రహ్మ"
(వా.రా/బా,కాం/ 2 స,.30-43 శ్లో)
బ్రహ్మ వాల్మీకి ఋషికి ప్రత్యక్షమై ఛందములో నారదుడు స్పష్టం చేసిన విషయాలకంటే ఎక్కువగా నీతికథలు, జన్మవృత్తాతములు..యుద్ధ రీతులను పొందుపరచి వ్రాయమని పలికి అంతర్ధానమౌతారు...ఈ రామాయణ గ్రంధము 7 కాండలు..24 వేల శ్లోకములతో వ్రాయబడినది.అయితే 24 వేల శ్లోకములందలి అన్ని పాదములలోను అక్షరములు సమానముగా (16)నున్నవి.ఈ ఘనత ఒక్కరామాయణమునకు  వాల్మీకి మహర్షికే దక్కినదంటారు.

పురాణగుమ్మడి 69-4/11/18
మ.కో//
బ్రహ్మలోకము జేరినా తన ప్రాణమాకలిదీరదే
బ్రహ్మయే వివరించెనాతని ప్రాప్తమున్తగురీతియున్
బ్రహ్మదెల్పిన రీతి వానిశవమ్మె భక్షణ జేయగన్
బ్రహ్మలోకము నుండితాను ప్రభాతమేదిగ నచ్చటన్
బ్రాహ్మణోత్తముడొక్కడచ్చట బాపె నెవ్వని దుర్దశన్
సరైన జవాబు.,,"శ్వేతుడు"
(వా.రా/ఉ,కాం/ 78 వ సర్గము చూడగలరు)

పురాణగుమ్మడి 70-5/11/18
మ.కో//
పుట్టగూడులుగట్టె నొక్కరు పుణ్యమూర్తి తపంబు చే
పట్ట, నేరకనొక్క కన్నియపార్ధమున్ముని గన్నులన్
గొట్టగా పుడకన్మునాయెగ  గ్రుడ్డి, వానినె బొట్టి చే
పట్టి  స్వామిగ సేవ జేసెను పత్నిగానది యెవ్వరో !
సరైన జవాబులు1)సుకన్య 

పురాణగుమ్మడి 71---8/11/18
చం//
జననము లేదు మృత్యువది జాడను లేదుగ యెల్లవేళలన్ !
తన నిజ రూప మెచ్చటను ధారణసేయక మెల్గుచుండు, తా
గొనగనదృశ్య రూపమునకొక్కటి గావలె నిశ్చయంబుగా !
కనగనులేరు నెవ్వరును కన్నులు గానవదేమనందురో !
సరైన జవాబు...."ఆత్మ"
(భగవద్గీత..2 వ అ 20 వ శ్లో)

పురాణగుమ్మడి 72---9/11/18
ఉ//
విష్ణువె పోషకుండు జన,విశ్వమునంతట గాయుచుండునా
విష్ణువె శాశ్వతుండుగను విశ్వము నేలెడి యీశ్వరుండు నా
విష్ణువె సాటిలేని శుభవేలుపు, భక్తులనుద్దరించు యా
విష్ణువు జీవినేజనమఁ వీడని కర్మల గంధమేయిదీ !!
సరైన జవాబు..."ఊతులు"
2-262-క.
హరి సర్వేశుఁ డనంతుఁడు
నిరుపమ శుభమూర్తి సేయు నిజభక్త జనో
ద్ధరణము పోషణ మవనీ
వర!యూతు లనంగఁ గర్మవాసన లరయన్.
భావము:
రాజ్యంలోని ప్రజలను పోషిస్తుండే పరీక్షిన్మహారాజా! ఇక పోషణ అంటే విశ్వేశ్వరుడు, శాశ్వతుడు, సాటిలేని శుభమూర్తి, పాపాలను హరించువాడు అయిన విష్ణుభగవానుడు తన భక్తు లను ఉద్ధరించుట, పోషించుట. మరి జీవుల జన్మజన్మలకైన విడువని కర్మల వాసనలను ఊతులు అంటారు.

పురాణగుమ్మడి 73---10/11/18
భూతిలకము(పంచపాది)
వీడెను విష్ణువుఁ వాణి లక్ష్మిలఁ వీడె పూజలు సేయుటన్
వీడెను యఙ్ఞము, యాగమున్, మదివీడకెప్పుడు దల్చునా
కోడెవయాళివ జీరుడన్, హరి కోపమున్శపియించగన్
వీడెను నాతడు సర్వసంపదఁ, బేసికంటి వెనంటఁ సూ
రీడును, బ్రహ్మయుఁ వేడెవిష్ణుఁ, విరించిఁ వీడిన దెవ్వరో
సరైన జవాబు....."వృషధ్వజుడు"
దే.భా..,పేజి 709
(దే.భా..తృతియ స్కందము.అ,27 శ్లో 57)

పురాణగుమ్మడి 74---11/11/18
తరళము//
వెడలె క్రవ్వముఁ గోరగన్సుతి వేగిమార్గమునందునే
గుడిచె సూనుడు, భుక్తశేషముఁ గుర్తెరింగిన తండ్రి తా
పెలుచఁ దేశబహిష్కరంబిడె వీనికిన్వడువేగదీ
తడు రణంబున గెల్వ వృష్ణిని తాను వోఢగ నెక్కియున్
గెలువ దైత్యుల తాను పొందిన కీర్తి నామముఁ దెల్పరే
సరైన జవాబు..,"పురంజయుడు"(కకుత్ స్థుడు)
(సుతి=తండ్రి...వడువు=కుమారుడు...వృష్ణి=ఇంద్రుడు వోఢ=వృషభము)
(పో.భా/9--157 - 163 వికుక్షి చరితము.,ఇక్ష్వాకు శకాదుల కథ..కకుత్ స్తుని వృత్తాంతము)

పురాణగుమ్మడి 75---12/11/18
దృవకోకిల (పంచపాది)--తరళము
పుడమి పైనన పుట్టి వెంటనె బొట్టియొక్కటి లేచియున్
తలచె వేదముఁ వింతగా,తలిదండ్రి వేడిన గానకే
వెడలె కానల కప్పుడే కడువేగిరంబుగ తాపసై !
వలచి యామెను దీవిరాయుడు పట్టచేయి, శపించి తా
వెడలి నామెయె రామపత్నిగ వెల్గె నెవ్వరు దెల్పరే !
సరైన జవాబులు  "వేదవతి౧...
(కుశద్వజ మహారాజు యింట పుట్టిన ఆడుబిడ్డ పుడుతూనే వేదాలు వల్లించినదందునే వేదవతి అయినది...రావణాసురుడామెను మోహిచి ఆమెకరమందగా నా కారణముగానే నువ్వు మరణిస్తావని శపించి అంతర్ధానమైనది. ఆమెయే త్రేతాయుగమున సీతాదేవి, కుశద్వజ మహారాజు ఇల్లాలు "మాలావతి"యే "వేదవతి" తల్లి)
++++++++++++++++

పురాణగుమ్మడి 76-13/11/18
మానిని//
చక్కని చుక్కయె చక్కర దక్కిన చందముఁ దక్కగఁ జప్పున నా
చిక్కిన చక్కని చెక్కిలి చుక్కను చేగొని చక్కగ చెక్కగ మా
తక్కడ గ్రక్కున దక్కువ నొక్కరి దల్పక నందరి తక్కెడ వే
సక్కర దీర్చెను చక్కని దేమది చక్కగ జెక్కెను సవ్యముగా
చిక్కద చుక్కయు జెక్కగ మీరలు చిక్కది లేకనె, చిక్కును లే !
చక్కని  అందమైన
సరైన జవాబు.."మత్స్యయంత్రము"

పురాణగుమ్మడి 77-14/11/18
ఉ//
వీడెనయోధ్యనామెకడు వేదనఁ చేరెను మౌనిపంచకున్
వేడగ రక్షణిచ్చితన వేదన బాపెను మౌని యొక్కరున్
వీలుగ నేర్చెసంతునట విద్యలనన్నియు నస్త్రశస్త్రముల్ !
కాలము నచ్చివచ్చియట కన్నియనొక్కటి దక్కెసంతుకున్
పాలన జేయనొచ్చెతను వైష్ణవి రక్షణ నిచ్చిగాయగా
వేడిన తోడనే యతివ వేదన బాపిన మౌని యెవ్వరో  ?
సరైన జవాబు "భరద్వాజముని"
(కథాంశము "సుదర్శనుని" చరిత్ర..తండ్రి "శూరసేనుఱెడు" మరణించిన పిమ్మట తల్లి "మనోరమ" బిడ్డతో "భరద్వాజుని" ఆశ్రమం చేరింది. సుదర్శనుడు జగన్మాత కృపాకటాక్షముతో  "శశికళ"ను వివాహమాడి.యుధాజిత్తును అతని మనుమడు శత్రుజిత్తు ను యుద్దమున జగన్మాత సాయమున సంహరించి తిరిగి కోసలదేశాధీశుడుగా రాజ్యపాలన చేస్తాడు.)
(దే.భా,వ తృతీయ స్కందము సుదర్శనుడి కథ..15-16)''

పురాణగుమ్మడి 78- -15/11/18
ఉ//
అన్నియు తానె భావమున యందరి పూజలు పొందగోరుచున్
ఎన్నక యగ్నిహోత్రమును,యీశ్వరుఁ, గోవులఁ,యఙ్ఞయాగముల్
మన్నన సేయనొక్కనికి మర్షము,ఙ్ఞానము భక్తిమెండుగా
నున్న సుతుండుగల్గె కడునుత్తముడెవ్వరి సత్త్వమందురో !!
సరైన జవాబు..,"లీలావతి; .
(మర్షము-క్షమ,ఓర్పు)
(హిరణ్యకశుపుని కుమారుడైన ప్రహ్లాదుని తల్లి పేరు  లీలావతి)

పురాణగుమ్మడి 79- -16/11/18
ఉ//
వృత్తుని సంహరించిగొనె వృష్ణియు గోవుది హత్యపాతకం
బుత్తలపాటుచే తనకు మూగెను దప్పిక యాకలెంతయో
యుత్తమ మౌనిపుంగవులు యుక్తిగ బాపిరి గంగ హోమితో
అత్తఱి దీరనాకలియునంతశుచిత్వము నాప్రదేశముల్
ఉత్తమ రీతిగా వరము నొందిన వేవవి దెల్పరేబుధుల్
సరైన జవాబు..."మలద"-"కరూశ"
వా.రా/బా,కాం/23 వ స/19-22 శ్లో.

పురాణగుమ్మడి 80- -17/11/18
ఉ//
కూర్పక గూఢచారులను, కోరుట స్త్రీలను నిత్యకృత్యమై !
నేర్పుగ రాజ్యపాలనముఁ నేరక, యింద్రియ భోగలోలుడై
దర్పము జూపుచున్ ప్రభువు దల్పక రాజ్యపు శ్రేయసౌఖ్యముల్
ఓర్పును, రాచకార్యముల నొగ్గిన దప్పదు రాజ్య బ్రష్టమున్ !
నేర్పుగ మీరలందరిట నిక్కముఁ దెల్పరె యన్నదెవ్వరో
సరైన జవాబు.."శూర్పణఖ"
{వా.రా/అర,కాం/33 వ స/5-7 శ్లో}

పురాణగుమ్మడి 81- -18/11/18
భూతిలకము//(పంచపాది)
దానవ సోదరులిర్వురున్జగదాంబ మన్మధ యార్తులై
పూనగ కామము, మాయ మోహముఁ పోరకిచ్చె వరంబు "మా
పానము నిత్తుము మేము నిర్జల ప్రాంతమందని" శ్రీహరే
దానవు లిర్వురనుగ్గడించనదంత సావియె మారె, నా
దానవు లిద్దరు జావగానటదంత మారినదెట్లునో
సరైన జవాబులు-"మేదిని"
మహా జలప్రళయమనంతరము శేషపర్వంకము పై నిద్రిస్తున్న విష్ణుమూర్తి కర్ణముల నుండి రాలిపడిన గుబిలి ఉండలనుండి ఉద్భవించారు మధుకైటభులు.జగదాంబతో యుద్దసమయమున దేవీ సౌందర్యరూపమునకు మోహపరవశులై వారిమరణరహస్యమును తెలిపిన మీదట శ్రీ హరి వారిని సంహరించినప్పుడు వారిమృత కళేబరములనుండి ప్రవహించిన క్రొవ్వు భూమిగా మారినది
సావి( క్రొవ్వు. మేదస్సు )మేదిని ( భూమి) అయినది అందుకే మృత్తిక (మట్టి )తినరానిదైనది.
(దే.భా,,ప్రధమ స్కంధం అ,,9...శ్లో..87)

పురాణగుమ్మడి 82- -19/11/18
ఉ// (మాలిక)
కూడదు నాస్తికత్వమును క్రోధమసత్యములాడుచుండుటన్ !
కూడదు ఇంద్రియంబులకు కోర్కెలు నేమరుపాటునెంతయున్ !
కూడదు కాలయాపనము గొంచము నైనను కార్యభారమున్ !
కూడదు సోమరై బ్రతుక, కోరిన కార్యము రేపుమాపనన్ !
కూడదు ఙ్ఞానవంతులను కూడక యుండుట, యేకనిర్ణయం
కూడదు, బెక్కువైరులెడ కూడదు దండది యేకకాలమున్ !
కూడదు మంతనంబులును గోరుట మిక్కిలి మందబుద్ధులన్ !
కూడదు మర్మముల్ విడుటఁ గూడదు వీడ సుసంప్రదాయముల్ !
ఏలిక జాగరూకతల నెక్కువ దెల్పెనెవారికెవ్వరో ?
సరైన జవాబు..."భరతునితో శ్రీరాముడు"
(వా.రా/ అయో.కాం/100 స/66--68 శ్లో)

పురాణగుమ్మడి 83- -20/11/18
తరళము//
ఇరువురన్నల మధ్యతాభగినే, మనంబున నిల్పెనొ
క్కరిని యెన్నడు గానకున్ననుగంటితో! యతి రూపుతో
నరుగుదెంచియు నాతడే కరమందె కోమలిఁ బ్రేమతో!
తరచి గాంచియు తోడుఁ దెల్పరె తాను బొందిన సాథికిన్
సరైన జవాబు...,"వసుదేవుడు"
సుభద్ర కు అత్త కుంతి...ఆమె తోబుట్టువు "వసుదేవుడు"
(సాథి =అత్త,,తోడు =తోబుట్టువు)

పురాణగుమ్మడి 84- -21/11/18
సుగంధి//(పంచపాది)
కోమటొక్కరుండె బీద గోరె బమ్మసాయమున్ !
ఏమిగోరలేదు బంగరేమి, రత్నరాసులన్ !
"లేమి దీర జెప్పుమయ్య లేశమైన మంత్రమో,
నోమొ,తంత్రపూజొ, సేయునుంట"నెవ్వరందురో
నోము  జేసిపొందె తాను నోము పంట నంతటన్
సరైన జవాబు...సుశీలుడు.
(186--187 దే,భా.సుశీలుడు కథ)

పురాణగుమ్మడి 85- -25/11/18
ఉ//
లేడు త్రిలోకముల్వెదకఁ లేడుగ నెవ్వడు యానతివ్వగన్ !
వీడున యెవ్వడైన మధువేమియు దక్కినరణ్యమందునన్ !
వీడుము సామదానముల భేదములన్నియు భూమిజందునన్ ?
కోడిని పుంజుగూడినటు గూడుము దండనె మార్గమంచు తా
వేడిన దెవ్వరో నిటుల వీడగ క్రోధము పంక్తి గ్రీవుడున్ !!
సరైన జవాబు.."మహాపార్శ్యుడు"
(వా.రా/యు,కాం/13 వ సర్గ/2--3--4  శ్లో,)

పురాణగుమ్మడి 86- -26/11/18
చం//
మగువ కొసంగ మంత్రము కుమారుని బొందెగ యామె యచ్చటన్!
తగని విధంబనెంచినది తాబహు సిగ్గున జేసె నీటిపా
లు గరభ కోశమెందుచుఁ, తళుక్కున మెర్వగ కుండలంబులున్!
నిగనిగ వెల్గుచున్ శిశువు నేరుగ రాధకు సూనుడయ్యెగా!
సరైన జవాబు :-  1)"దూర్వాసమహాముని వద్ద"
పై పద్యమునందు ప్రశ్న "మగువ కొసంగ మంత్రము కుమారుని బొందెగ యామె యచ్చటన్" యెచ్చట అనేది కూడా నా ప్రశ్న

పురాణగుమ్మడి 87- -27/11/18
కవికంఠభూషణ//
కురువంశ జామి, తనకొచ్చెగ యొక్కవికల్ప రూపు, తా
సరియైనపత్ని కడుజక్కగ పాండవులైదు మందికిన్ !
కురుసార్వభౌమ సభగొల్లుమనంగ విషణ్ణ మోముతో
మరుమాటలేకజనె మానిని భర్తల గూడరణ్యమున్ !!
సరైన జవాబు ,,, "శచీదేవి"---
("ఈమె వికల్పరూపు" నాప్రశ్న)
(వికల్పము=పాక్షికము)(వధువు=భార్య)
(ద్రౌపది శచీదేవి పాక్షికరూపుతో ద్రుపదునికి యఙ్ఞద్వితీయ ఆహ్వానంబున అయోనిజై లభించిన కుమార్తె ప్రధమాహ్వానంబున దుష్టద్యుమ్నుడు యుద్భవించెనుగావునతడు యీమెకు సోదరుడైనాడు)

పురాణగుమ్మడి 88- -28/11/18
ఉ//
"ఎందుకు నీకు పోరు ధనుసెక్కును బెట్టుట కాదుభావ్యమున్?
సుందరమైన గుండియను చోద్యము దాచగ నెట్లుచెల్లునో!
విందును జేయువీణఝరిఁ వీడియునేలనె ఘంటనాదముల్ !
పొంది వికార రూపమును పోరుకు రమ్మని రెచ్చ గొట్టవే
సుందరి సంహరించనిను శూరుడ నే"నని యన్నదీతడే!!
సరైన జవాబు.."శుంభుడు"
జగదంబికతో యుద్దమునకొచ్చిన శుంభుడు దేవి దివ్యమంగళ సుందర రూపమును గాంచి కామమోహితుడై పలికిన పలుకులు
(దే.భా,,5వ స్కం/31/37-38..దే,భా 369 పే)

పురాణగుమ్మడి 89- -29/11/18
ఉ//
శూలపు రూపుతో శివుని శూలము దక్కగ రాక్షసేంద్రుకున్ !
కాలక్రమంబులో నదియె కైదువుగాయెగ వానిసూనుకా!
శూలము చేతనే మడిసె సూర్యుని వంశపు శూరుడొక్కడున్!
శూలము నందకన్ సమసె సూనుడు సూర్యపు వంశ హస్తమున్ !!
సరైన జవాబు."మధువు"-"లవణాసురుడు."--"మాంధాత"--"శత్రుఘ్నుడు"
శివుని నుండి శూలము వరముగా పొందినరాక్షసేంద్రుడు...."మధువు"
వాని సూనుడు..."లవణాసురుడు"
శూలము ప్రభావమున లణాసురునిచే సంహరింపబడిన ఇక్ష్వాకువంశ ప్రభువు "మాంధాత"--లవణాసురుడు ఆహారము నిమిత్తము అడవులకు వెళ్ళి తిరిగి వచ్చు సమయంలోవాని పుర ద్వారము వద్ద కాపుగాసి శూలమందకుండజేసి వానిని హతమార్చిన ఇక్ష్వాకువంశ ప్రభువు  "శత్రుఘ్నుడు"---పాదమునకో ప్రశ్న .,జవాబు
(వా,రా/ఉ.కాం/67 స.69స,  కథాంశము)

పురాణగుమ్మడి 90- -30/11/18
చం//
అగరము మవ్వమున్దళపమంబరకేశుని హస్తమందునన్
మగువుల క్రొవ్వెదన్తురుము మాలయునల్పము కాంతిమంతుడున్
ఉగమునుమూర్ఖుడన్పదములొగ్గ త్రయక్షర మధ్యవర్ణముల్
నిగవుగ గూర్చినంతటనె  నెక్కొను వేలుపు మిమ్ము బ్రోవుగా
సరైన జవాబు:-"మాయలచెంచురాయుడు"
అగరము="అమాస",మవ్వము="హొయలు",,,దళపము=ఆయుధము..అంబరకేశుడు=శివుడు..హస్తమందునన్.=చేతిలో "శివుని చేతిలోని"శూలము"),...మగువల=స్త్రీల,క్రొవ్వెదన్=కొప్పులో ,...తురుము= సింగారించుకొను . మాలయు="పూచెండు" అల్పము="ఇంచుక"
కాంతిమంతుడు="రేరాజు" ,ఉగము="ఆయువు",మూర్ఖుడున్="హుండుడు", పదములు=పదములు....ఒగ్గ=కూర్చగా త్రయక్షర=మూడక్షరముల మధ్యవర్ణముల్ =మధ్యలోని అక్షరములు ..నిగవుగ=మనోఙ్ఞముగా గూర్చినంతటనె=కూర్చినవెంటనె...నెక్కొను=ప్రాప్తించు, వేలుపు=దేవర,..మిమ్ము=మీ అందరిని,బ్రోవుగా=బ్రోచునుగదా
అగరము.....  ...,.,         ....అ"మా"స---------మా
మవ్వము.............,..,.,..,హొ"య"లు.........య
దళపమంబరకేషుని హస్తమున్
శివుని చేతి ఆయుధము     శూ"ల"ము...........ల
మాల.,,,,,,,,,,,,,,,......,,..,,.పూ"చెం"డు.........చెం
అల్పము....,,,,,,,,,,-----,,,,,ఇం"చు"క............చు
కాంతిమంతుడు,,,.....,,,,,, రే"రా"జు..............రా
ఉగము...........................ఆ"యు"వు........,.యు
మూర్ఖుడు.......................హుం"డు"డు........డు
"మాయలచెంచురాయుడు"

పురాణగుమ్మడి 91- -1/12/18
మానిని//
అందము సొంతము నాతని గర్వమునందమె కావగయశ్వనులం
శందున గల్గినయంగజ మాద్రికినాతడు గాసెగ యశ్వములన్
అందున కొల్వునయందరి తోడుగ ,యాతడు, ధర్మజుడాచదురున్
పొందిన సంఙ్ఞలు పోరిన వారది పూనిన నామముఁ బూన్చుమిటన్
 
సరైన జవాబు..1)"దామగ్రంధి"-2)కంకుభట్టు..3) వలలుఁడు 4)బృహన్నల
ఆతడు..నకులుడు,  ధర్మజుడు  ధర్మరాజు, పోరిన వారది ఆ కొలువులో ఉండి యుద్ధం చేసినవారు  అనగా భీముడు అర్జునుడు   ఈ నలుగురు  విరాటకొలువులో ఉన్నప్పుడు పొందిన పేర్లు మాత్రమే అడిగాను..కావున   1)"దామగ్రంధి"-2)కంకుభట్టు..3) వలలుఁడు 4)బృహన్నల..,ఇదే సరైన జవాబు
(విరాటకొలువున నకులుని నామము "దామగ్రంధి",,ధర్మరాజు పేరు "కంకుభట్టు" ఆకొలువులో ఉన్నప్పుడు  పోరిన వారిరువురు   భీముడు,అర్జునుడు     కీచకునితో పోరాడిచంపిన భీముని పేరు "వలలుఁడు"ఉత్తరగోగ్రహణ సమయంలో పోరు సల్పి విరాటుని గోసంపద రక్షించి అర్జునుడు పేరు "బృహన్నల")

పురాణగుమ్మడి 92- -2/12/18
ఉ//(షట్పది)
కోరగ నొక్కడాయతివఁ కోరిక దీర్చగ గల్గినొక్కడే
కారకుడయ్యెవంశ గతి గాంచియు నిర్వురి నిశ్చయంబుఁ సం
సారపు సౌఖ్యమెందితను సంతతి గల్గగ, యందునొక్కడా
సూరుడు వానిఁదాయయొకసూరునిఁ పత్నిసపత్నికిన్సనా
భౌరసుడీలిగెన్పగఱ వారలు గొట్టగఁశాస్తతోడుతన్
పోరగ కానివారిజత పోరున బంధము వీడి యెవ్వరో !!
సరైనజవాబు.."రుక్మరథుడు"
ప్రతి పదార్ధము,భావము:-కోరగ=కోరినంతట..ఒక్కడు=ఒక్కడు(పరాశరుడు)..అతివ=ఆమె (మత్స్యగ్రంధి) కోరిక దీర్చగన్ =కోరిక తీర్చినందున../ కల్గినాతడే =పుట్టినటువంటివాడే(వ్యాసుడు)/ కారకుడయ్యె= కారణమయ్యెను /వంశగతిగాంచి =వంశోద్ధారకులులేరని చూసీ/ ఇర్వురి నిశ్చయంబుఁ =ఇద్దరి నిశ్చయించగా(సత్యవతి,భీష్ముడు)/సంసారపు= సంసారముయెక్క/ సౌఖ్యమొంది =సుఖమనుభవించి/ తను =అతడు/ సంతతి గల్గగ =సంతానము కలుగుటకు/ అందునొక్కడా సూరుడు =వారిలో ఒకడు ఆరాజు (ధృతరాష్ట్రుడు)/ వానిదాయయొకసూరునిఁ = వాని దాయాది ఒకరాజుకు(పాండు రాజుకు)/ పత్ని = భార్య (కుంతి)/సపత్నికిన్ =సవితికి(మాద్రికి)/సనాభి= సోదరుడు(శల్యుడు)/ఔరసుడు= కుమారుడు (రుక్మరథుడు)/ఈలిగె= చచ్చెను / పగఱవారలు = శత్రువులు /కొట్టగ =కొట్టినంత./ శాస్తతోడుతన్= తండ్రితో కలసి/ పోరగ =యుద్ధము చేయగా /కానివారిజత= పరాయివారితోకలసి/ పోరున =యుద్ధమునందు/ బంధము= బంధుత్వము/  వీడియెవ్వరో= విడచిపెట్టి ఎవరో?
కావున సరైన జవాబు  "రుక్మరథుడు"

పురాణగుమ్మడి 93- -3/12/18
పంచచామరము//
జనించె సూనులున్ శతంబు, సత్వ శూరులందరున్ !
కనంగ నొక్కటాపురంబుఁగట్టిలెన్ యొకండుకే !
తనింత గుర్వుమాటనైనదల్పకన్ వినాశనం
బునొందె నొక్కయింతిమూలమున్తనెవ్వరో? తనున్
జనించె నెవ్వరందుఁ? తానుజన్మనొందెనెవ్వరిన్ ?
సరైన జవాబు.,,అరజ...శుక్రాచార్యుడు..బృగువు
                                   లేదా
సరైన జవాబు., దండుడు...ఇక్ష్వాకు.....మనువు
(వా.రా/ఉ,కా/79-80 స్కం.కథాంశము)
1)జనించె సూనులున్ శతంబు, సత్వ శూరులందరున్ !
వంద మంది కుమారులు పుట్టారు (ఎవరికో ఓకరికి) అందరూ
బలశాలులే..
2)కనంగ నొక్కటాపురంబుఁగట్టిలెన్ యొకండుకే !
కథాంశము పరికించి.చూడగా ఒకపట్టణము(మధుమంతపురము) ఒక్కనికి ప్రాప్తించినది
3)తనింత గుర్వుమాటనైనదల్పకన్
ఆ పట్టణం ప్రాప్తించినవాడు గురువు అనేమాటను కూడా తలంచకుండా  ....,,
వినాశనం
బునొందె నొక్కయింతిమూలమున్తనెవ్వరో?
ఒక స్త్రీ కారణమున నాశనమైనాడు  (ఇక్కడ  తనెవ్వరో..స్త్రీ అనుకుంటే  అరజ..,పురుషుడనుకుంటే  దండుడు
కావున ....
.,,అరజ...శుక్రాచార్యుడు..బృగువు
                     లేదా
., దండుడు...ఇక్ష్వాకు.....మనువు
ఇక్ష్వాకువుకు పుట్టిన నూరుమంది కొమరులలో కనిష్ట కుమారుడైన దండుడు "మధుమంతము" అనుత్తమ పురము నిర్మించుకొని రాజాయెను.  వానిపురోహితుడు కులగురువైన శుక్రాచార్యుని కుమార్తె అయిన "అరజ"ను బలవంతముగా చెరచి అనుభవించుటవలన శాపగ్రస్తుడై నాశనమయ్యెను.అరజ  శుక్రాచార్యుని కొమరిత  శుక్రాచార్యుడు  బృగువు కుమారుడు.

పురాణగుమ్మడి 94- -4/12/18
ఉ//
చూడగ నాతడే నిలువ చుట్టుర లక్షల యోధులచ్చటన్
గూడును సింహగర్జనపు కూకలు వేయుచునుత్సవంబుగా
వీలుగ సైన్యమందతడు వేచియు నుండెను మ్రోలభాగమున్
తూలును వైరి పట్టణము దూకుచు గర్జన సేయనాతడే
వేడితి మిమ్మునెల్లరను వేగమె భావము దెల్పుమిచ్చటన్
సరైన జవాబు ..."నీలుడు"
వా.రా/ యు.కాం/26 వ,స/11--13 శ్లో)

పురాణగుమ్మడి 95- -5/12/18
ఉ//
పూర్వము నొక్కయప్సరస పోవగ నాకశ మార్గమందునన్
గర్వముఁ కామమోహమున గైకొని కూడెను ఖష్పమున్ తనే
కర్వరు మానమందిరుడు, గాంచగనామెను కోపతాపమున్
"దర్వుడ యెన్నడైన పర తామరకంటిని గూడ ఖప్పమున్
ఉర్వడి నీదు మస్తకము యూడుట తధ్యము నూరుముక్కలై"
పూర్వముఁనొక్కరీవిధము పోడిమిమాలగ శాపమిచ్చె యా
కర్వరు ఘాతుకంబుగను గైకొని కూడిన యప్సరెవ్వరో!!
సరైన జవాబు.."పుంజికస్థల"
(వా.రా/యు.కాం/13 వ సర్గ  9-14 శ్లో)

పురాణగుమ్మడి 96- -6/12/18
ఉ//
జాదుకొనంశ తేజమును శక్తిగ, మిక్కిలి ఙ్ఞానతేజమున్
రాదుగ మృత్యువున్ తనకు రాయిడి నైనను బ్రహ్మయస్త్రమున్
రాదుగ మృత్యువున్ తనకు రాజు యమాయుధ ఘాతచేతనన్
తాదొఱయన్ మహోన్నతగు త్రాణముఁ వేలుపులందరివ్వగన్
పాదుకొనెవ్వరో హనువుఁ పత్సలమున్బడి సంప్రతీతి యై
నీద కుమారుడొక్కడిల నిల్చెను గాయుచు భక్తకోటినిన్
సరైన జవాబు:-"హనుమంతుడు"
(వా.రా/ఉ.కాం/35.36 సర్గలు)
సంక్షిప్తంగా కథాంశము
((హనువు-దవడ,పత్సలము-ఘాతము...ఈద-వాయువు-) సూర్యుడు, రాహువులను ఫలముగా భావించిన మారుతి ఇంద్రుని వజ్రాయుధము దెబ్బకు దవడ చిట్లి పోయి మూర్చిల్లిన సమయంలో వాయుదేవుడు సకల ప్రాణులను చలన రహితము చేసినప్పుడు సూర్యుడు తన తేజస్సులో నూరవ భాగముతో పాటు,ఛందస్సు ,సకల శాస్త్రఙ్ఞానము ప్రసాదించెదననెను.విశ్వకర్మ..యముడు వారివారి ఆయుధములచే హానిలేనివిధముగావరములొసగెను. ఇంద్రుడు బంగారు పద్మముల హారముతోపాటుగా  తన వజ్రాయుధము వలన మారుతి దవడ(హనువు) గాయపడినందున "హనుమంతుడు"అనుపేరుతో ఖ్యాతిగాంచునని వరములు ప్రసాదించినారు

పురాణగుమ్మడి 97- -7/12/18
ఉ//
ఆలియు లేదు, కాపురపు హాయియు నించుక లేని యొక్కడున్
మేలగు సంతుగోరితను మేలిమి మంత్ర తపంబుజేసి తా
వేడగ బేసికంటిదొర బిడ్డడు గల్గ వరంబునివ్వగన్
ఆడగ నొక్కయప్సరస యాతని కాయెను శుక్లపత్నమున్
ఆడినయప్సరీమెనట యాతడు బొందిన సూనుడీతడే?
సరైన జవాబు,,"ఘృతాచి-శుకుడు"
(వేదవ్యాసునికి శుకుడు కుమారుడుగా పుట్టిన కథ..)

పురాణగుమ్మడి 98- -8/12/18
మ.కో//
అల్లె త్రాటిని గట్టి పట్టుకొనంత రాముడు లాగగా
విల్లుగూలెను భళ్ళుమంచును విస్తుబోయిరి యందరున్
తల్లిజానకిగూడి నల్వుర తధ్యమయ్యెను బెండ్లి యా
చెల్లెలిర్వురి కన్యదాతకు జేర్చి యప్పను గోరితిన్
సరైన జవాబు..,1)కుశద్వజుడు..2)హ్రస్వరోముడు
(జనక మహా రాజు సోదరుడైన కుశద్వజుడు మాండవి,శృతకీర్తులకు తండ్రి అతడు  భరత ,శతృఘ్నులకు వారినిచ్చి కన్యాదానమొనర్చెను.జనక కుశద్వజుల తండ్రి హ్రస్వరోముడు)

పురాణగుమ్మడి 99- -9/12/18
ఉ//
దానవ వంశ మూలమునతండతనంగజులిర్వురున్జతన్
కానలకేగె, యెక్కడు ప్రకాండరమెక్కి తపంబుజేసెఁ సం
తానముఁగోరి, యగ్ని వరదానముచే తనకాష్టమందు సం
తానమునుద్భవించి కడుతాపమొనర్చె జగంబునాతడే !
దానవ వంశమూలమును, దానవ సూనులు, సంతుఁగోరితిన్
సరైన జవాబులు...దనువు,"రంభుడు-కరంబుడు,మహిషాసురుడు
1)దనువు (దానవ వంశానికి మూల పురుషుడు)
2) రంభుడు- కరంభుడు  (అతనికుమారులు.,)
3)మహిషాసురుడు(రంభుని చితిలోనుండి ఉద్భవించిన వాడు)

పురాణగుమ్మడి 100- -10/12/18
మ,కో//
పాపభారము మోయజాలక బారెనొక్కరు గోవుగా
రూపమున్గొని గావమంచును రోదనంబున గోరె తా
నాపలేకట రుక్మి, కేశిలు నర్క, ధేనుక, కంసులన్
బాపగాన్శిశుపాల, శాల్యల, భారమెవ్వరు నెవ్వరిన్?
సరైన జవాబులు
1)భూదేవి   2)ఇంద్రుడు
(కథాంశము భూదేవి మొర ,,ఆ,,బే.రా.బ్ర..,దేవీ భాగవతం  4వ స్కం. 245--246 పేజీలు  )

పురాణగుమ్మడి 101- -11/12/18
ఉ//
శాస్త్రము వేదసారమును జక్కగ గూర్చినయాదికావ్యమున్ !
శాస్త్రము ధర్మతత్త్వముల సంమిళితంబొక గొప్పకావ్యమున్ !
శాస్త్రము భక్తిమోక్షముల సారము బంచిన దొక్కటిందు నే
నస్త్రము రూపులిచ్చిచిరు యంశము బేర్చితి నేవనందు రీ
శస్త్రము గుమ్మడాటమన సంపదె యెంచిన యచ్చతెల్గునన్?
శాస్త్రములన్నియున్తమకు శస్తము, సౌఖ్యమొసంగ గోరుచున్
అస్త్రములిచ్చుటాపెదిక "యాదరణిచ్చిన మీకు మ్రొక్కుచున్"
సరైన జవాబు
రామాయణము-భారతము-భాగవతము
.....................,................సమాప్తం.................................

1)పురాణఝరి-1--15/12/18
సుగంధి//
శ్రీ కరుండు బుద్దినిచ్చి సిద్ధిగూర్చి గాయుచున్
లోకమంతటాది పూజలొప్పువిఘ్ననాయకుం
డేకదంత పుష్టికాంతుడీజగంబునేలుచుం
డా కరేణువున్మొగంబుఁదాల్చి నాతడెవ్వరో
సరైన జవాబు...శ్రీ మహాగణపతి

పురాణఝరి-2--16/12/18
చం//
సరకముఁ జేర ఱేడొకడు సంతస మొందుచు సశ్శరీరమున్
జరుపను గోరె యఙ్ఞమును జాగదిలేకనె నిశ్చయంబుగన్
గురు, గురుసూనులైన తనకోరిక నొల్లక శాపమివ్వగన్
కరుణను గాచెనాతనిని గాదిసుతుండట, వైరమిందుకే
గురువెడ గాధిసూనునికి కోరిక దీరెను దీర్చ నీతడే!!
సరైన జవాబు 1. "బ్రహ్మఋషత్వము కొరకు" "బ్రహ్మ"
వసిష్టమహాముని  విశ్వామిత్రులిరువురి నడుమ "బ్రహ్మఋషత్వము కొరకు" వైరము కల్గెను. వసిష్టమహా ముని గాధి రాజుకుమారుడైన విశ్వామిత్రుని రాజర్షి గానే గుర్తించెను గాని బ్రహ్మర్షిగా గుర్తించకుండెను.అందుచే గాధేయుడు బహు వత్సరములు కఠోర తపమాచరించి బ్రహ్మ వరదానముచే బ్రహ్మర్షి యయ్యెను.

పురాణఝరి-3--17/12/18
మ.కో//
మెండుగా కొలువందు నుండగ మేటిఋష్యులు, బ్రహ్మయున్
కండకావరమేమొ నవ్వెను గాంచి శాంభవి పెన్మిటిన్
పండపాపము నామెశాపముఁ బార బుట్టిన దెవ్వరో
ఖండఖండములాయె నాతని కంఠమొక్కటి సాలునన్ !
సరైన జవాబు.."వృత్తాసురుడు"..
( పార్వతీ దేవి శాపఫలమున  చిత్రకేతుడే  వృత్రాసురుడుగా జన్మించాడు అతని కంఠం చుట్టూ తిరిగి ఖండించుటకు ఇంద్రునికి సంవత్సర కాలం పట్టినదట)

పురాణఝరి-4--18/12/18
ఉ//
వానర యోధుడే యతడు వాలము బెద్దది యెంచిచూడగా!
వానికి దైన్యమెన్నడును ప్రాపుకు జేరదు, రోషమెక్కువే!
వానిది యుద్దమెప్పుడును వైరికి దోచును బెగ్గలమ్ముగా
సేనలఁ గూడిలంకఁ సతి చేయగ బూనిన యాతడీతడే!!
సరైన జవాబు..."కుముదుడు"
(వా.రా/ యు.కాం/26 వ,స/27-30 శ్లో)

పురాణఝరి-5--19/12/18
మ.కో//
బ్రోవగా నవనీధరమ్మును మూపుఁ గాయుచు కూర్మమే
దేవదానవులంత శంఖిఁ మధించఁ వెల్వడ నాతడే
ద్రావగా యమృతంబు గైకొని, తానె పొందొక నామమున్
భావమేమది దెల్పగానిట భాగ్యవంతులె మీరలున్
అమృతము=విషము
సరైన జవాబు..."గరళ కంఠుడు".లేదా ."నీలకంఠుడు"

పురాణఝరి-6--20/12/18
ఉ//(పంచపాది)
వేడుకఁ వేటకేగి దొర పేరడగించెను రక్కసొక్కనిన్
నేలను గూల్చకే వదలె నేతయు నాతని బ్రాతనచ్చటన్
గూలని బ్రాత పాచనము కొచ్చియు జేరెను ఱేడు కొల్వునన్
వాడినె గోరె ఱేడు ముని వచ్చిన రోజున విందుగూర్చగన్
వాడగ మాసి క్రవ్వమును వంటన, మౌని శపించె నెవ్వనిన్
సరైన జవాబు .."సౌదాసుడు(వీరసహుడు)"--
(వా.రా/ఉ,కాం/65 వ,స)

పురాణఝరి-7--21/12/18
వసంతమంజరి//
సముద్ర గర్భము నందు నగరపు చారచక్షువు నెవ్వరో?
కొమరిఁ చేగొని యాతడు వెడలి, కోరె నొక్కరిఁ వాని లో
కమున,నచ్చక రాకొమరులిలఁ, కంజరుండటదెల్ప  ని
చ్చె ముసలాయుధ ధారికి సుతను శీఘ్రమేగతడెవ్వరో?
ముచ్చటగా మూడు జవాబులివ్వండి..
సరైన జవాబులు
1)కుశస్థలి నగరము రాజు..."రేవతుడు"
2)కుమార్తె.,,,,"రేవతి"
3)రేవతినిచ్చిన ముసలాయుధ ధారి  "బలరాముడు"

పురాణఝరి-8--22/12/18
భూతిలకము//
అల్లట మామకు రాజనందిని యాదరంబిడ శాప మి
వ్వల్లుడు కోతిముఖంబు దాల్చినఁ వానిఁ భామ గొనెవ్వరో !
మెల్లగ విష్ణువు నీటదింపగ మేలిమింతిగ నాయె తా
నల్లన చేగొన రాజునొక్కడు నామెకున్బహుసంతతే !
అల్లుడు మామలు, కాంతఁ చేగొనినాతడెవ్వరు దెల్పరే! !
.
సరైన జవాబులు,,,
1)కోతి ముఖందాల్చిన నారదుని చేగొన్న యింతి...,"దమయంతి"
2)అల్లుడు.మామలు..,"పర్వతుడు","నారదుడు"
3)స్త్రీ రూపంలో ఉన్న నారదుని చేగొని బహు సంతతి పొందిన వాడు...."తాళద్వజుడు"

పురాణఝరి-9--23/12/18
తరళము//
ఇలను గొప్పగ నొక్క యఙ్ఞము నెంచి సేయగ ఱేడు తా
బిలచె గౌతమ, వామదేవుల,వేదపండితులందరిన్
కుల గురాతడు యఙ్ఞమొల్లక గోరెనింద్రుని యఙ్ఞమున్
కలత నొందిన రాజుజేసెను గౌతముండునదర్వుగా
కులగురెవ్వరు ఱేడు నెవ్వరు గోరె నేనిట దెల్పరే
సరైన జవాబులు..1)వసిష్టుడు  2) నిమి మహారాజు

పురాణఝరి-10--24/12/18
ఉ//
సీతకు భర్తగా వెలసె  శ్రీహరి నిల్పగ  తండ్రిమాట తా
మాతకు నొక్కడే సుతుడు, మాత సపత్నులు నిర్వురందునే
ఆతని సోదరుల్గలిగె నందరు నల్వురు సంకటంబునం
దూతము నిచ్చెనూఢలుగ నోర్పున వారల పూజ్యులెవ్వరో!!
సరైన జవాబు..,"దశరథమహారాజు"
(-ఊఢ అనగా భార్య) (పూజ్యుడు అనగా మామ)

పురాణఝరి-11--26/12/18
మ.వి//
యదువంశంబున బుట్టెగా నొకరు తానారంభ మందెవ్వరో ?
యదియున్ యిర్వురు పత్నులన్గలసియే! యాభార్యలైరెవ్వరో ?
అదియే యాభృగు శాపమున్వెలసెగా హంసుండెవర్కెవ్వరో?
పదిలంబాయెగ యాదిషేషుడట నెవ్వర్కోతనేరూపుగన్
సరైన జవాబులు
1)కశ్యపుడు--వసుదేవుడుగా
2)అదితి-దితి,,(దక్ష ప్రజాపతి కుమార్తెలు )..దేవకీ-రోహిణీదేవి గా
3)విష్ణుమూర్తి --శ్రీకృష్ణుడుగా  దేవకి గర్భమున
4)ఆదిశేషుడు..బలరాముడుగా రోహిణీ గర్భమున
(దుష్ట శిక్షణకు జగన్మాత వ్యూహం....250 వ పేజి,,దే. భా.బే.రా.బ్ర)

పురాణఝరి-12--27/12/18
ఉ//
పాండవ సిద్దిగోరితను బాసట యయ్యెను ధర్మశీలుడా
నిండగ కౌరవేంధ్రసభ నీతడె మౌనము వీడిబల్కె, తా
గుండియ నుగ్గబట్టియట కోరగ ద్రౌపది ధర్మనీమ మా
తండుయె దక్కెనంతమున తక్కిన యోధులు డస్సివోయినా
యండగ నిల్చిగాసెతను హాయిగ నీశుని యెవ్వరందురో
సరైన జవాబు,.,"యుయుత్సుడు"

పురాణఝరి-13--28/12/18
కం//
లోకము లన్నియు నేలెడి
లోకోద్దారక విలాసి లోకములందున్
లోకపు కంటక గుటిలుర
నేకుల గూల్చుయవజితుల నిట్లనదగునా!!
సరైన జవాబు--- "స్థానము" -
(ఈ స్థానము అనే విష్ణు మహిమ కల్పాది నుండి కల్పాంతాలవరకు సాగుతూనే ఉంటుంది.)
పోతన గారి క్రింది పద్యమునకు నా పద్యము అనుకరణ
లోకద్రోహినరేంద్రా
నీకముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా
వైకుంఠనాథు విజయం
బాకల్పస్థాన మయ్యె నవనీనాథా!
భావము:
ఓ రాజా పరీక్షిత్తు! లోకద్రోహులైన రాజులను సంహరించి లోకాలను సంరక్షించుటలోని ఆ వైకుంఠుని విజయాలను స్థానము అంటారు. ఈ స్థానము అనే విష్ణు మహిమ కల్పాది నుండి కల్పాంతాలవరకు సాగుతూనే ఉంటుంది.

పురాణఝరి-14--29/12/18
మేదిని//
అలుగుటయే యెరుంగడెపుడా యమాంగజుండున్
పలికె రణంబునందు గురు  ప్రాణముగ్గలించన్
కడకొక శుండి నామమును, క్వాణమిచ్చుగా నా
తడు సమరంబునన్, విజయ తాపిఁ దెల్పుచున్ యా
సడినిడు నెద్దియో దెలుపుమయ్య సంతసంబున్
సరైన జవాబు.."అనంతవిజయ"
(ధర్మరాజు శంఖము పేరు "అనంత విజయ" యుద్దారంభమున ధ్వని చేసినది ,కురుక్షేత్ర యుద్దాంతమున పాండవ విజయ సంకేతము తెలియచేసినదిదే)

పురాణఝరి-15--31/12/18
కవికంఠభూషణ//
శత పత్నులున్న ప్రభు సంతతి గోరి మునీశ్వరాశ్రయం
బుఁ తనొక్కయఙ్ఞ క్రతువున్ సలుపన్ జలపూర్ణకల్శమం
ది,తమస్సుఁ  ద్రావఁ కడుతీరని దాహముచేత పొందెగా
సుతునొక్కనిన్కడుపుఁ, జూడగ ఱేడు,సుతుండు నెవ్వరో
సరైన జవాబులు..1)రేడు-"యౌవనాశ్వుడు"2) సుతుడు-"మాంధాత

పురాణఝరి-16---1/1/19
మ.వి//
వనవాసంబది యంతమై కదలగా వారందరఙ్ఞాతమున్!
కనికారంబున పాండవుల్పొదవె నఙ్ఞాతంబు నంతంబవన్!
మనమున్గోరిన రూపమున్దొడగి సేమంబొందు రీతిన్సదా!
కనగా నెవ్వరునిచ్చె నీవరము నేకార్యంబు సాధించగన్ ?! !
సరైనజవాబు
వరమిచ్చిన వారు ..యక్షరూపమున "యమధర్మరాజు;
"యక్షప్రశ్నల"కు ధర్మరాజు సరైన సమాదానము లిచ్చినందున

పురాణఝరి-17--2/1/19
చం//
గురువు బృహస్పతే విడువఁ ,గోరిరి గుర్వుగ విశ్వరూపునే
గురుశిరమింద్ర ద్రుంచెకడు క్రోధమునొంది హవిస్సు కారణం
బరయగ తండ్రి పొందెనట బాలుని నెవ్వని యఙ్ఞ గుండమున్
బరువుగ తోచనింద్రునికి పట్టి వధించను గుర్వు భ్రాతనే
యరిగిడి బొందెనంతటదియంబుజమీతని శల్యమేగదా!!
సరైన జవాబులు
1) వృత్రాసుసుడు
2) దధీచి మహర్షి(వీరి ఎముకతోనే ఇంద్రుని వజ్రాయుధము చేయబడినది) (శల్యము=ఎముక)

పురాణఝరి-18--4/1/19
ఉ//
భ్రంశమునొంది సీత ముని ప్రాపున జేరెను కానలందునన్
వంశము సూర్యవంశమిట బాలుర యిర్వురి జన్మవృత్తమే
యంశము, జెప్పగా లవకుశందురు వారలనెందుచేతనో
సంశయమిప్పరే బుధులు సందడి జేయుచు మీరలందరున్
సరైన జవాబు
"పుట్టినతోడనే లవులు  కుశులపై పరుండ బెట్టినందున"
(దర్భలు మద్యకు త్రుంచినపుడు కొనల లాగా ఉండే పైభాగమును కుశులు అంట్టారు క్రింది మొదటి భాగమును లవులు అంటారు..వ్యాసమహర్షి సీతామాతకు పుట్టిన కవల బిడ్డలనిలా మద్యకు త్రుంచిన దర్భలపై పరుండ బెట్టుటచే.,లవుల మీద పరుండబెట్టిన వానిని లవుడని  కుశులుపై పరుండబెట్టిన వానిని కుశుడని  అన్నారు)

పురాణఝరి-19--5/1/19
మ.కో//
రాజ హైందవు డెవ్వరో? తనరాజ దర్పముఁ జూపుచూ
మోజుగన్గొన కామధేనుఁ, మోసమున్సుతిఁ జంపగా !
రాజ వంశమునెల్ల జంపెను  రాముడంతట క్రోధమున్
రాజు గాదతడెవ్వ రొచ్చెను? రామ మార్గము కడ్డమున్
సరైన జవాబులు,,
1)కార్తవీర్యార్జునుడు...2)పరశురాముడు
కార్తవీర్యార్జునుడు.. కామధేనువు కోసం జమదగ్ని ని సంహరించిన హైందవ క్షత్రియుడు  ( సుతి-తండ్రి)
పరశురాముడు...జమదగ్ని కుమారుడు 21 మార్లు రాజుల మీద దండెత్తి ఎందరో రాజుల రక్తముతో మడుగులు నింపిన వాడు బ్రాహ్మణుడే ,రాజవంశీయ్యుడు కాదు.
అతడే  శ్రీ రామచంద్రుని అడ్డగించాడు సీతారాములు పరిణయమైన పిదప  మిథిలా నగరమునుండి అయోధ్యానగరానికి వెళ్ళే సమయంలో.

పురాణఝరి-20--6/1/19
సుగంధి
రాజులందరోడ యుద్దరంగమందు తీరుగా
రాజసూయయాగ రొక్కరాసులందె ఫల్గుణుం
డాజయంబుచేత దక్కెనంతటొక్క నామమే
మీ? జయించఁ యిచ్చెనింద్ర మెచ్చి యేది? దైత్యులన్!!
సరైన జవాబులు...
1)ధనుంజయుడు  2) దేవదత్తము
(రాజసూయాగం కొరకెందరో రాజునొండించి దనం సమకూర్చినందున అర్జనునకు "ధనుంజయుడు" అనే నామమొచ్చినది
దైత్యులనోడించినందున ఇంద్రుడు అర్జనునకు "దేవదత్తము" అనుపేరుగల శంఖమునిచ్చినాడు)

పురాణఝరి-21--7/1/19
ఉ//
అల్లుడు జేయగా క్రతువులత్తలు పొందెను గొప్ప సంతతిన్ !
చెల్లెను మామయున్ తనదు చిత్తము దీర్చియు నాలిగోరగా !
కల్లగ పొందగోర కుజఁ కాలము చెల్లె నొకండు పోరునా
చెల్లిన దెవ్వరో ?క్రతువు జేసిన దెవ్వరు? మామయెవ్వరో?
ముచ్చటగా మూడు జవాబులివ్వగలరు
సరైన జవాబులు.,1).రావణాసురుడు 2) ఋష్యశృంగ ముని 3)దశరథ మహారాజు

పురాణఝరి-22--8/1/19
తరళము//(షట్పది)
గురువు లేనిదిజూసి కూడెను గోరగా గురుపత్ని యే
గురువుఁ వీడియు జేరి యాయెను గుర్విణీ, గురుగోరినా
తరిమె రాక్షస సాయమొంది యతండు నివ్వక నాలినిన్ !
అరిగి బ్రహ్మనుకోరగా యతనామె సంతును శిష్యకున్
గురువు కామెను పంపకంబిడె, గుర్వుపత్నియు నెవ్వరో?
గురువునెవ్వరు శిష్యుడెవ్వరకో శరీరవజెవ్వరో?
యోచించి నాలుగు జవాబులివ్వండి
సరైన జవాబులు..1)తార 2)బృహస్పతి 3)చంద్రుడు 4)బుధుడు
1.గురుపత్ని,,,తార
2.గురువు ..బృహస్పతి
3.శిష్యుడు..చంద్రుడు
4.కుమారుడు(శరీరవజుడు).. బుధుడు